కెసిఆర్కి చెక్ చెప్పేందుకు రేవంత్ 'ఆపరేషన్'! హైకోర్టు తీర్పుపై సీఎం మంతనాలు
హైదరాబాద్: ఈ రోజు నుంచి ఆపరేషన్ స్వగృహ ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురు టిడిపి నేతలను తెరాసలో చేర్చుకుంది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గురువారం నుంచి ఆపరేషన్ స్వగృహ పేరుతో టిడిపిని వీడి ఇతర పార్టీలలో చేరిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గ్రేటర్ నాయకుడు ఎస్వీ కృష్ణ ప్రసాద్ ఈ రోజు టిడిపిలో చేరారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. టిడిపి ఆంధ్రా పార్టీ అన్నవారి చెంప చెళ్లుమనిపించేలని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలలో పదవుల్లో ఉంటే మాత్రమే గౌరవమని, కానీ టీడీపీలో మాత్రం పార్టీలో ఉంటే చాలు గౌరవం దక్కుతుందన్నారు. అధికార టిఆర్ఎస్ పైరవీకారుల పార్టీగా తయారయిందన్నారు.

కోర్టు బుద్ధి చెప్పింది: కెసిఆర్పై మండిపడుతున్న విపక్షాలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కుదింపు జీవో విషయంలో కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలికంగా చుక్కెదురయింది. దీనిపై అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. తెరాస ప్రభుత్వానికి ఇది చెంప పెట్టు అని విమర్శలు గుప్పిస్తున్నాయి.
గురువారం నాటి కోర్టు తీర్పు తెరాస ప్రభుత్వానికి చెంప పెట్టు అని సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూసిన ప్రభుత్వానికి కోర్టు తగిన రీతిలో బుద్ధి చెప్పిందన్నారు. ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సీఎం కెసిఆర్ దౌరతనానికి నిదర్శనమన్నారు.
హైకోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ తీరు మయన్మార్, పాకిస్తాన్లో మాదిరి ఉందన్నారు. గడువు ఇవ్వకుంటే ఎన్నికలను బహిష్కరించాలా లేదా అనే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కెసిఆర్ మంతనాలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కుదింపు విషయంలో హైకోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు జరుపుతున్నారు. నిపుణులు, మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. అలాగే గవర్నర్ నరసింహన్తో ప్రభుత్వ సీఎస్ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications