సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పిల్లలు, ఛలో సర్కారీ బడులు - సీన్ మారుతోంది..!!
ప్రభుత్వ బడుల దశ మారుతోంది. ఇప్పటి వరకు పేద విద్యార్ధులు మాత్రమే ప్రభుత్వ బడులకు వస్తారనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. లక్షలాది రూపాయాల జీతాలు తీసుకొనే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చటానికి ముందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 'మన ఊరు- మన బడి'తో బడుల్లో సకల సౌకర్యాలు సమకూరుస్తుండటంతో..ప్రయివేటు కంటే ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే నమ్మకం కలుగుతోంది.
ప్రభుత్వ బడులు కళకళ:హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రభుత్వ బడులు కళకళాడుతున్నాయి. మణికొండ..రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, గండిపేట,గచ్చిబౌలిన ప్రాంతాల్లోని బడుల్లో అడ్మిషన్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. అవన్నీ అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు కొలువుదీరిన ప్రాంతాలు. అక్కడ ఉండే వారికి డబ్బులకు కొదువ లేదు.

తమ పిల్లలను లక్షలు పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్థోమత వారికున్నది. కానీ, వారి దృష్టి ఇప్పుడు సర్కార్బడులపై పడింది. ఆ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి తల్లిదండ్రులు సిఫారసులు తీసుకొస్తున్నారు. హెచ్ఎంలు అడ్మిషన్ల తాకిడిని తట్టుకోలేక స్క్రీనింగ్, బేస్లైన్ టెస్టులను నిర్వహిస్తున్నారు.
భారీగా పెరిగిన అడ్మిషన్లు
ఐటీ కారిడార్లోని పలు బడుల్లో ఆరు నుంచి పది తరగతులు అంటే 5 తరగతుల్లోనే వెయ్యికి పైగా విద్యార్థులున్నారు. ప్రైమరీ స్కూల్స్ 500కు పైగా విద్యార్థులతో నిండిపోయాయి. బడుల్లో సకల సౌకర్యాలు ఒనగూరడం.. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫారాలు అందించడం.. మధ్యాహ్న భోజనం సమకూరుస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడులకు వలసలు పెరిగాయి.
దీంతో ఐటీ కారిడార్లోని జనం సర్కార్ బడులకు క్యూ కడుతున్నారు. బడిబాట ఎన్రోల్మెంట్ డ్రైవ్ ముగిసినా.. అడ్మిషన్ల కోసం వినతులు వస్తున్నాయి. 'మన ఊరు- మన బడి' కార్యక్రమంతో బడులు కార్పొరేట్ లుక్ను సంతరించుకున్నాయి. ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు.

డిజిటల్ తరగతులు..సకల వసతులు
మణికొండలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 331 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరిలో 40 మంది ప్రైవేట్స్కూళ్ల నుంచి వచ్చినవారే. శేరిలింగంపల్లి మండలంలోనే 47 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 12 జెడ్పీ హైస్కూళ్లున్నాయి. మొత్తం 59 స్కూళ్లుండగా.. వీటిలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఇక్కడ 6 నుంచి10వ తరగతి వరకు ఒక్కో తరగతికి మూడు సెక్షన్లు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రాథమిక పాఠశాల జెడ్పీ స్కూల్లోనే నిర్వహించగా, గదులు సరిపోకపోవడంతో ప్రైమరీస్కూల్ను మరోచోటికి తరలించారు. తరగతి గదుల్లో డిజిటల్ విద్యాబోధన కొనసాగుతున్నది. అటల్ టింకరింగ్ ల్యాబ్, స్టెమ్ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి అధునాతన సౌకర్యాలున్న ఈ స్కూల్లో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.












Click it and Unblock the Notifications