బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్గా సతీష్ నియామకం: కేసీఆర్ రావాలి, ఆగని విద్యార్థుల నిరసన
హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడో రోజు కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. నిన్న వర్షంలో.. ఈరోజు ఎండలోనూ విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన తగ్గేదేలే అని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు.
విద్యార్థులు, వారికి మద్దతుగా వారి తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మూడ్రోజులుగా చేస్తున్న ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది.ఈ క్రమంలో కాస్త దిగొచ్చిన సర్కార్ బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ కుమార్ను నియమించింది. ఆయన విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చింది.
అయినా, వెనక్కి తగ్గిన విద్యార్థులు డైరెక్టర్ నియామకంతో తమ సమస్యలు పరిష్కారం కావని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ వద్దకు వస్తే తప్ప ఆందోళన విరమించమని తేల్చి చెబుతున్నారు.
ఇది ఇలావుండగా, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని భైంసా ఏఎస్పీ తెలిపారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. డైరెక్టర్ నియామకం గురించి విద్యార్థులకు చెప్పామని అన్నారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపేశామన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులందరికి కూడా ఆహారం, నీళ్లు అందుతున్నాయని తెలిపారు.
కాగా, విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వచ్చిన వారి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులవి సిల్లీ డిమాండ్ అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసినట్లు వచ్చిన వార్తలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కలెక్టర్ భరోసా కల్పించినా.. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు విద్యార్థులు. మూడు రోజులుగా 8వేల మంది విద్యార్థులు ఆందోళన చుస్తుంటే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రధానమైన 12 సమస్యలను పరిష్కరించాకే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
మూడు రోజులుగా విద్యార్థులు ఎండా వానలు లెక్కచేయకుండా ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి.