తెరాస ఎమ్మెల్యే హోటల్పై ఓయూ విద్యార్థుల దాడి
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను ఆక్రమించుకొని హోటల్ నిర్మించారని ఆరోపిస్తూ ఓయు విద్యార్థులు హబ్సిగూడలోని శాసన సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హోటల్ పైన దాడికి దిగారు. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కొందరు విద్యార్థులను అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న స్వాగత్ హోటల్ ముత్తిరెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. దీంతో ఓయూ భూములను ఆక్రమించి ఎమ్మెల్యే హోటల్ కట్టారని ఆరోపిస్తూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
లోకాయుక్తలో ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయం భూమిని తీసుకోవాలని చూస్తోందని విద్యార్థులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఓయూ భూములు ఎవరికీ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.
ముందుగా కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోండి
జంట నగరాల్లో కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకొని వాటిల్లో పేదలకు ఇల్లు నిర్మించాలని తెలంగాణ శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి విశ్వవిద్యాలయాల భూములను ఎంపిక చేయడం ద్వారా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వివాదం సృష్టించారని అన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ నగరంలో ఆక్రమిత భూముల పైన దృష్టి సారించాలన్నారు.