మన కూతుళ్లు సురక్షితమేనా?: సింగరేణి కాలనీ చిన్నారి ఘటనపై మహేశ్ బాబు భావోద్వేగం
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై సర్వత్రా ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడ్ని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఆరేళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా..
చిన్నారిపై అత్యాచారం చేసి, అనంతరం దారుణంగా చంపిన నిందితుడు పల్లంకొండ రాజు(3)ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, సమాజం కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆ కామాంధుడి కోసం పెద్ద ఎత్తున గాలింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే నిందితుడు రాజును పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డ్ ప్రకటించారు పోలీసులు. అత్యంత దారుణమైన ఈ సంఘటనపై ప్రముఖులు స్పందిస్తున్నారు. గత గురువారం సాయంత్రం నిందితుడు రాజు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన గదికి తాళం వేసుకుని పరారయ్యాడు. అన్నిచోట్లా గాలించిన తల్లిదండ్రులు చివరకు అతని గది తాళం పగలగొట్టి చూడగా విగతజీవిగా చిన్నారి కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల హీరో మంచు మనోజ్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే.
మన కూతుళ్లు సురక్షితమేనా? అంటూ మహేశ్ బాబు భావోద్వేగ ట్వీట్
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించారు. భావోద్వేగానికి గురైన మహేష్ సమాజంలో పడిపోతున్న విలువలను ప్రశ్నించారు. 'హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన దారుణమైన ఘటన.. సమాజంలో పడిపోతున్న విలువలకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ సమాజంలో మన కూతుళ్లు సురక్షితంగానే ఉంటారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కుటుంబం ఈ బాధను ఎలా తట్టుకుంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అధికారులు వెంటనే తగిన చర్యలను తీసుకొని చిన్నారి కుటుంబానికి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను' అంటూ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
నిందితుడిని పట్టించినవారికి రూ. 10 లక్షల రివార్డ్
కాగా, నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు ఇస్తామంటూ రివార్డు ప్రకటించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసుపై కీలక సమీక్ష నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు. నిందితుడు రాజు ఆనవాళ్లను విడుదల చేశారు సీపీ అంజనీకుమార్. రాజు రెండు చేతులపై మౌనిక అనే టాటూ ఉందని.. వయస్సు సుమారు 30 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. రాజు ఎత్తు 5.9 అడుగులుగా ఉంటుందని.. పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని తిరుగుతాడని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వాళ్లు పోలీసులకు ఫోన్ చేయాలని కోరారు. నిందితుడిపై ఏకంగా రూ. 10 లక్షల రివార్డు ను ప్రకటించారు. ఆ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామంటూ ఓ ప్రకటన ను కూడా విడుదల చేశారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.
ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సైదాబాద్ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి డబ్బులు ఇవ్వడం తో పాటు వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366, 9490616627 అనే ఫోన్ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ కోరారు.