మేడారం జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ.!మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న మంత్రి సత్యవతి రాథోడ్.!
వరంగల్/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల కొంగు బంగారం మేడారం జాతర ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం సమీక్షించింది. లక్షల్లో వచ్చే భక్తులకోసం ఏర్పాట్లు ఏవిధంగా ఉండాలనే అంశంపై మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ ప్రభావం, కొత్త వేరియంట్ ఏవిధంగా విజృంభిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రాధమికంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుండే కాకుండా మద్యప్రదేశ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, రాష్ట్రాలనుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు వస్తుంటారు కాబట్టి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసువోవాలి అనే అంశాలపై చర్చించారు అధికారులు. మేడారం జాతరకు వివిధా ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన, ఏర్పాట్ల పైన బుదవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పర్యవేక్షించారు. మేడారం అమ్మవార్లు సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
Recommended Video
జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కావల్సిన స్నాన ఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా తిరిగి పర్యవేక్షించారు. జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతలతో సమీక్ష ప్రారంభించారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్యే శ్రీమతి సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు ఉన్నారు.