పాకాల సరస్సుకు శాంతి పూజలు.. నర్సంపేటలో ఉప్పొంగుతున్న చెరువులు!!
గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సు ఉదృతంగా ప్రవహిస్తుంది. నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సు తోపాటు మాదన్నపేట చెరువు, రంగాయ చెరువు , వట్టె వాగు నిండు కుండల్లా మారాయి.
నేడు ఖానాపూర్ మండలంలో అశోక్ నగర్ గ్రామంలోని పాకాల సరస్సును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పరిశీలించారు. మత్తడి పోస్తున్న పాకాల సరస్సు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ శాంతించాలని పూజలు నిర్వహించారు. పాకాల సరస్సు కట్టపై ఉన్న గట్టమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.

వరద ఉధృతికి ప్రమాదపు అంచులో ఉన్న పాకాల కట్టను పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నర్సంపేట నియోజకవర్గం లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తో మాదన్న పేట చెరువు మత్తడి పోస్తుండడంతో నేడు వరంగల్ ఈస్ట్ జోన్ ఇంచార్జి డిసిపి దాసరి మురళీధర్ మత్తడిని సందర్శించి ఎలాంటి ప్రమాదకర సంఘటనలు చోటచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని నర్సంపేట పోలీస్ సిబ్బందికి సూచించారు.
కాగా మాదన్నపేట చెరువు కట్టను ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చారు . అనంతరం మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న మైసమ్మ తల్లికి గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పూజలు నిర్వహించారు.
సంగెం మండలం ఎలుగూరు రంగంపేట చెరువు గండిపడడంతో వట్టె వాగు వరద ఉదృతి పెరిగింది. దీంతో చుట్టూ పక్కల ఉన్న గ్రామాలకు ప్రమాదం పొంచి ఉన్న నేపధ్యంలో ముంపు గ్రామాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి . అదేవిధంగా నెక్కొండ మండలకేంద్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నర్సంపేట నియోజకవర్గం మొత్తం వర్షాలతో అతలాకుతలం అవుతున్న క్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications