ఆ పోలీస్ కమీషనర్ కు పాలాభిషేకం: సూపర్ పోలీస్ అంటూ ప్రజాభిమానం!!
ఆ పోలీస్ కమీషనర్ కు పాలాభిషేకం చేస్తున్నారు సామాన్య ప్రజలు. సూపర్ పోలీస్ అంటూ ప్రజాభిమానం చాటుకుంటున్నారు.
ఆయన పోలీస్ కమిషనర్.. నేరస్తుల పాలిటి సింహ స్వప్నం. సొంత శాఖలోనే అధికారులు ఎవరైనా తప్పు చేసినా క్షమించని నైజం ఆయన పారదర్శకతకు అద్దం పడుతుంది. భూ కబ్జాలు, ల్యాండ్ పంచాయతీలలో తల దూర్చితే రాజకీయ నాయకులైనా, పోలీసులైనా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పిన సూపర్ పోలీస్ ఆయన. సామాన్య ప్రజలు ఆయనకు పాలాభిషేకాలు చేస్తున్నారంటే ఆయన ఎలా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆయన ఎవరంటే...

వరంగల్ లో నేరాలపై ఫోకస్.. 892 మంది భూకబ్జాదారుల డేటా బేస్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏరి కోరి వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమించిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఏవి రంగనాథ్. వరంగల్ పోలీస్ కమిషనర్ గా వచ్చిన అనతి కాలంలోనే చాలా మంచి పేరు సంపాదించిన పోలీస్ అధికారి. వచ్చి రావడంతోనే వరంగల్లో చోటు చేసుకుంటున్న నేరాల వెనుక, ప్రధాన సమస్యగా ఉన్న భూవివాదాలపై దృష్టి సారించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 892 మంది భూకబ్జాదారుల డేటా బేస్ ను రూపొందించి వారందరి భరతం పట్టడానికి రంగం సిద్ధం చేశారు ఏవి రంగనాథ్.

వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో భూ అక్రమాలకు చెక్ పెట్టే పనిలో సీపీ రంగనాథ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనగామ, స్టేషన్ ఘనపూర్, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట పరకాల నియోజకవర్గాలు పూర్తిగా, హుస్నాబాద్, హుజురాబాద్, పాలకుర్తి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో భూ కబ్జాలు చేసే వారిని, ల్యాండ్ పంచాయతీలు చేసే వారిని, భూ అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి వారిని కట్టడి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఆయన చేసిన ఓ పని నేటికీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చర్చనీయాంశంగానే ఉంది.

కార్పొరేటర్ పై కేసు.. ఎమ్మెల్యేల గుండెల్లోనూ వణుకు పుట్టిస్తున్న సీపీ
భూ ఆక్రమణ, బెదిరింపు కేసులో అధికార పార్టీకి చెందిన, స్థానికంగా, ఆర్ధికంగా బలమైన నాయకుడు అయిన వేముల శ్రీనివాస్ అనే కార్పొరేటర్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. భూకబ్జాలకు ప్రయత్నం చేశారు అన్న కారణంతోనే అధికార పార్టీ నాయకుడు అని కూడా చూడకుండా కేసు నమోదు చేశారు. ఈ చర్యలతో ఒక్కసారిగా వరంగల్ కమిషనరేట్ వ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లోనూ, ముఖ్య నాయకులలోనూ వెన్నులో వణుకు పుడుతుంది. అంతేకాదు అవినీతి ఆరోపణలతో నల్లబెల్లి ఎస్సై ఎన్ రాజారాంను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా ఇచ్చారు.

రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగుడు
ఇక తాజాగా వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో దివ్యాంగుడైన అసద్ క్షీరాభిషేకం చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి తన ఇంటిని కబ్జా చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని, తనను బెదిరిస్తున్నాడని సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన ఇంతెజార్ గంజ్ పోలీసులు అసద్ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల స్పందనకు కృతజ్ఞతలు కమిషనర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అసద్.

సామాన్యులకు ఆపన్న హస్తంగా సూపర్ పోలీస్ ఏ.వీ. రంగనాథ్
కబ్జాదారులకు, రాజకీయ నాయకులకు కొమ్ము కాయకుండా, సామాన్యుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయడానికి వరంగల్ సిపి ఏవి రంగనాథ్ వేస్తున్న అడుగులు స్థానికంగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ సామాన్య వ్యక్తి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అంటే అది ఆయన పనితీరుకు అడ్డం పడుతుంది.
నేరస్తుల పాలిట సింహం గా.. సామాన్యులకు ఆపన్న హస్తంగా పని చేస్తున్న సూపర్ పోలీస్ కు ఇప్పుడు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారు. పోలీసులందరూ వరంగల్ సిపి రంగనాథ్ బాటలో పని చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications