బాబు లెక్కలే చెబుతున్నా: జూపల్లి, మీరు మాట్లాడొద్దు: అరుణ, కార్మికులకు తలసాని తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడు నాడు పెట్టిన బడ్జెట్ లెక్కలనే తాను చెబుతున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు సోమవారం అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి, జూపల్లిలు పాలమూరు ప్రాజెక్టులపై సవాల్, ప్రతిసవాల్ విసురుకుంటున్న విషయం తెలిసిందే.
ఏకపక్షంగా సమయం, తేదీ నిర్ణయించారన్న రావుల వ్యాఖ్యలపై జూపల్లి స్పందించారు. చర్చకు సమయం, ప్రదేశం మీరే నిర్ణయించాలని సూచించారు. చంద్రబాబు పెట్టిన బడ్జెట్ లెక్కనే తాను చెప్పానని తెలిపారు. అవి కూడా తప్పంటే నేనేం చేయలేనన్నారు.
ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ ఇచ్చినట్లు తాను రుజువు చేస్తానని చెప్పారు. 7,500 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. చర్చకు తాను ఒక్కడినే వస్తానని చెప్పారు.
కాగా, జూపల్లి అంతకుముందు మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, అలా ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. దీనిపై రావుల ఘాటుగా స్పందించారు.
జూపల్లి మాట మారుస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఆపాలని చంద్రబాబు లేఖలో కోరలేదని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం టిడిపికి మద్దతుగా నిలిచారు.
పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన మాట్లాడే హక్కు టిడిపి, టిఆర్ఎస్ పార్టీలకు లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. రూ.1000 కోట్లతో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశమున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలపై సిఎం కెసిఆర్కు చిత్తశుద్ధి లేదన్నారు.
జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెపై సర్కారు సీరియస్
గ్రేటర్ హైదరాబాద్ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పుష్కరాలు, త్వరలో బోనాలు, రంజాన్ పండుగల నేపథ్యంలో సమ్మె విరమించాలని ఆదేశించింది. కార్మికులు మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి ఆర్మీ, పోలీసులను ఉపయోగించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
సమ్మె విరమించకపోతే కొత్తవారిని నియమించో యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమకు కనీస వేతన చెల్లింపుపై స్పష్టత ఇస్తేనే సమ్మె విరమిస్తామని కార్మికులు చెబుతున్నారు. డిమాండ్లు పరిశీలిస్తామని మాత్రమే ప్రభుత్వం చెబుతోంది. దీంతో కార్మిక సంఘాలు సమ్మెను విరమించడం లేదు.స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కూడా.
తలసాని హెచ్చరిక
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పారిశుద్ధ్య కార్మికులను హెచ్చరించారు. కెసిఆర్ కార్మికుల పక్షపాతి అన్నారు. రంజాన్, బోనాల నేపథ్యంలో సమ్మెను విరమించి, విధుల్లో చేరాలన్నారు. సమ్మె విరమిస్తే రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మొండిగా వ్యవహరిస్తే కార్మికులకే నష్టమని చెప్పారు.