సారా రహిత జిల్లాగా పాలమూరు, గుట్టను జిల్లా చేయాలంటూ మోత్కుపల్లి దీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన, వలసల ప్రాంతంగా పేరొందిన పాలమూరు జిల్లాను సారా రహిత జిల్లాగా కలెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 1510 గ్రామాల్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించామన్నారు.
మూడు నెలల్లోనే జిల్లాలో గుడుంబాను పూర్తిగా అరికట్టామని చెప్పారు. త్వరలో కల్తీకల్లును పూర్తిగా అరికడతామని స్పష్టం చేశారు. గత మూడు నెలల్లో 3,854 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీరిపై తిరిగి కేసు నమోదైతే రూ. లక్ష చెల్లించేలా బాండ్లు రాసిచ్చే పద్ధతి తొలిసారిగా చేపట్టారు.
కేసులు నమోదైన వారిలో తిరిగి సారా కాసిన వారి నుంచి రూ. 17.30 లక్షలు రాబట్టినట్లు ఆమె తెలిపారు. దీంతో క్రమంగా సారా తయారీ, విక్రయాలు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. ఇకపై జిల్లాలో సారా విక్రయాలు, తయారీకి పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
అధికారుల మాట వినకుండా సారా తయారీ చేసిన 10 మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇది ఇలా ఉంటే పాలమూరుని సారా రహిత జిల్లాగా ప్రకటించడంతో మహిళలు, స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ శ్రీదేవికి కృతజ్ఞతలు తెలిపారు.
యాదగిరిగుట్టను జిల్లా చేయాలంటూ మోత్కుపల్లి నిరాహార దీక్ష
నల్గొండ జిల్లాలోని యాదగిరి గుట్టను ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్తో తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు యాదగిరిగుట్టలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. గుట్టలోని వైకుంఠ ద్వారం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న మోత్కుపల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు.