ఆస్తికోసం వదినపై దాడి: బుల్లితెర నటి శ్రీవాణిపై కేసు
హైదరాబాద్: వదినపై దాడి చేసిన కేసులో బుల్లితెర నటి శ్రీవాణిపై రంగారెడ్డి జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం శ్రీవాణిని విచారించారు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన శ్రీవాణి అన్నయ్య బాబ్జికి అనూష అనే మహిళతో వివాహం జరిగింది.
బాబ్జీ కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శ్రీవాణి, ఆమె సోదరి శ్రీకన్య మరికొందరితో కలిసి సోమవారం పరిగికి వచ్చారు. వదిన అనూష ఇంటికి వెళ్లి ఆమె ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని, వేరే వారికి విక్రయించేందుకు సదరు స్థలం చూపించారు. తన భర్త ఆదిత్యరెడ్డి సాయంతో తన ఇంటిని కూల్చివేసింది.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న అనూష బయటికి రావడంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లిన శ్రీవాణి వదిన అనూషపై దాడి చేసింది. తన తండ్రికి చెందిన ఆస్తిలో తనకు వాటా ఉందని, నీ భర్త చనిపోయాడు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఈ భూమిని అమ్ముకోని వెళ్లిపోతానని వదిన అనూషపై గొడవకు దిగడంతో పాటు ఆమెను చెప్పలేని పదజాలంతో దుర్భాలడింది.
అంతేకాదు తన అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటిని కూలగొట్టడంతో పాటు దౌర్జన్యానికి దిగింది. దీంతో ఆస్తికోసం వదిన అని కూడా చూడకుండా తనపై దౌర్జన్యానికి దిగిన శ్రీవాణిపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీవీ ఛానెళ్లలో దురుసుగా ప్రవర్తించే శ్రీవాణి అదే విధంగా తనపై దాడికి పాల్పడిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒక ఆడ రౌడీలాగా ప్రవర్తించి తన అనుచరులతో తనపై దౌర్జన్యానికి దిగిందని ఆమె వదిన అనూష ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నటి శ్రీవాణిని బుధవారం విచారించారు. ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై దాడికి యత్నించిందని శ్రీవాణి సైతం అనూషపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 428 ఏ, 452, 427 (34డి) సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అంతేకాదు తమ తండ్రి పరిగి గ్రామస్తుడని, ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని శ్రీవాణి పేర్కొంది. అయితే తాను ఉంటున్న ఇంటి స్థలానికి శ్రీవాణికి ఎలాంటి సంబంధం లేదని అనూష పేర్కొనడం విశేషం.
ఈ విషయమై సీఐ ప్రసాద్ను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై శ్రీవాణిని మీడియా వివరణ అడగ్గా ఇది పూర్తిగా మా కుటుంబ సమస్య అని ఎవరూ జోక్యం చేసుకోవద్దని చెప్పారు. కాగా, మా టీవీలో వచ్చే రాములమ్మ సీరియల్లో శ్రీవాణి ప్రేక్షకులకు బాగా సుపరిచితం.