పవన్ కళ్యాణ్! వెళ్లి కాపాడు: విహెచ్, తలసాని పిరికిపంద: షబ్బీర్ అలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం భూసేకరణ బిల్లు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు శుక్రవారం నాడు సూచనలు చేశారు.
పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతానికి వచ్చి రైతులను అడిగి తెలుసుకోవాలని, 95 శాతం మంది రైతులు భూమి ఇచ్చారని, మిగతా రెండు మూడు వేల ఎకరాల కోసం రాద్దాంతం చేయవద్దని, అక్కడకు వచ్చి తెలుసుకోవాలని ఏపీ మంత్రులు జనసేన అధినేతకు సూచిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు వీ హనుమంత రావు కూడా అదే విషయం పవన్ కళ్యాణ్కు చెబుతున్నారు. అయితే, రైతులను ఆదుకోవాలని సూచించారు.
ట్విట్టర్ ద్వారా సందేశాలు ఇస్తూ ఇంట్లో కూర్చోవడం సరికాదని, రాజధాని ప్రాంతానికి వెళ్లి రైతులను ఆదుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకుంటోందన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడకు వెళ్లి ఆపాలన్నారు.

తలసాని రాజీనామా చేసి గెలవాలి: షబ్బీర్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండలి సభ్యుడు షబ్బీర్ అలీ అన్నారు. తలసాని పిరికిపంద అన్నారు. ఒక పార్టీ పైన గెలిచి, ఇంకో పార్టీలో మంత్రిగా కొనసాగటం తలసానికే చెల్లిందన్నారు.
చట్టాలను ఉల్లంఘించిన తలసాని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తలసానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి భజన చేయవని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాయని షబ్బీర్ అలీ అన్నారు.












Click it and Unblock the Notifications