జగన్ కంపెనీల్లో 'పెన్నా' పెట్టుబడులు, ఆధారాలున్నాయి: హైకోర్టుకు సిబిఐ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో.. పెన్నా గ్రూప్ చట్టాలను ఉల్లంఘించిందని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. వైయస్ సర్కార్ నిర్ణయాలకు అనుగుణంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు వచ్చాయని, పెన్నాకు ప్రయోజనాలు కలిగాయని తెలిపింది.
పెన్నా గ్రూపు సంస్థలకు అప్పటి వైయస్ ప్రభుత్వం అక్రమంగా చేకూర్చిన లబ్ధికీ, దానికి ప్రతిఫలంగా నీకది నాకిది పద్ధతిలో జగన్ కంపెనీల్లో రూ.68 కోట్ల పెట్టుబడులు పెట్టారనటానికీ పత్రసహిత, మౌఖిక ఆధారాలు ఉన్నట్లు సిబిఐ వెల్లడించింది.
వైయస్ సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత ఐఏఎస్లు, ఇతర అధికారులు వాంగ్మూలాలను ఇచ్చినట్లు తెలిపింది. ఎఫ్ఐఆర్లో ఉన్న అందర్నీ కేసులో చేర్చలేదన్న కారణంగా దురుద్దేశాన్ని ఆపాదించడం సరికాదని పేర్కొంది.
ఎలాంటి ఆధారాలూ లేకుండా కేసు పెట్టిన సందర్భంలో కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించవచ్చనీ, ఈ కేసు విషయంలో బలమైన ఆధారాలున్నాయని సిబిఐ పేర్కొంది.
ఈ మేరకు తమపై కేసును కొట్టివేయాలంటూ పెన్నా సిమెంట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పయనీర్ హాలిడే రిసార్ట్స్ లిమిటెడ్, పెన్నా తాండూర్ సిమెంట్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్న పిటిషన్లపై సిబిఐ ఇటీవల కౌంటరు దాఖలు చేసింది. అనంతరం విచారణ 23వ తేదీ జరగనుంది.