అర్హులైన 57 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు.!ప్రభుత్వ పరిశీలనలో మరో బృహత్కర పథకం..!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్కర పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. యాభైఏడు ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. రెండో అసెంబ్లీ, 2021-22 సంవత్సర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలలో శాసన సభ్యులు పద్మాదేవేందర్ రెడ్డి, అరూరి రమేశ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి సవివరంగా సమాధానమిచ్చారు.
సీఎం కేసిఆర్ పై ప్రశంసలు..దేశంలోనే గొప్ప పథకంగా అభివర్ణిస్తున్న క్యాబినెట్..
కరోనా కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ, సీఎం చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి, 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నదని అన్నారు. అయితే, కరోనా కష్ట కాలంలోనూ పెన్షన్లను ఏమాత్రం ఆపకుండా ఇస్తున్న ఘనత సీఎం చంద్రశేఖర్ రావుదే అన్నారు. రాష్ట్రంలో 39లక్షల 36వేల 521 మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. 13,19,300 మంది వృద్ధులకు, 14,43,648 మంది వితంతువులకు, 4,89,648 మంది వికలాంగులకు, 37,342మంది చేనేతలకు, 62,942 మంది కల్లుగీత కార్మికులకు, 28,582 మంది ఎయిడ్స్ రోగులకు కేటాయిస్తున్నట్టు వివరించారు.
దేశంలో ఎక్కడాలేని పథకం.. సురక్షిత జీవనంకోసమే అంటున్న ప్రభుత్వ వర్గాలు..
అంతే కాకుండా 14,140 మంది బోదకాలు బాధితులకు, 4,08,621 మంది బీడీ కార్మికులకు, 1,32,298 మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఆసరా పెన్షన్ల కింద ప్రతి ఏడాది 11,724కోట్ల 70లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. పేద వారు సామాజిక బధ్రతతో కూడి సురక్షితమైన జీవితం గడపాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధికంగా సాధారణ పెన్షనర్లకు, 2,016 రూపాయలు, వికాలంగులకు 3,016 రూపాయలు అందిస్తున్నామన్నారు. దీంతో గతం కంటే అధికంగా ఆయా పెన్షన్లకు గౌరవ, మర్యాదలు దక్కుతున్నాయన్నారు.
కేంద్రం ఇచ్చేది 1.2 శాతం మాత్రమే.. రాష్ట్ర వాటా గణనీయమంటున్న మంత్రులు..
కేంద్ర ప్రభుత్వం కేవలం 6 లక్షల 66 వేల మందికి 200 రూపాయల చొప్పున 105 కోట్లు మాత్రమే ఇస్తుందన్నారు. కేంద్రం ఇస్తున్న డబ్బులకు అదనంగా 1,816 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. మొత్తం పెన్షన్లలో రాష్ట్రం 98.8శాతం ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం కేవలం 1.2శాతం మాత్రమే ఇస్తుందని మంత్రి సభకు తెలిపారు. అయితే, తెలంగాణ రాక ముందు అరకొరగా, 200 రూపాయల చొప్పున 29లక్షల మందికి ఇస్తే, తెలంగాణ వచ్చాక సీఎం చంద్రశేఖర్ రావు 39లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. గత ప్రనభుత్వం ఏడాదికి 8,710 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కేవలం నెలలకే 9 వందల కోట్లు పెన్షన్ల కోసం ఇస్తుందని మంత్రి తెలిపారు.
ఇతర రాష్ట్రాలకంటే చాలా మనమే ఎక్కువ.. హర్షం వ్యక్తం చేస్తున్న మంత్రులు..
దేశంలో పెన్షన్ల ప్రక్రియపై ప్రభుత్వం చేసిన పరిశోధనలో మిగతా అన్ని రాష్ట్రాలు మనకంటే చాలా తక్కువ పెన్షన్ మొత్తాన్ని ఇస్తున్నట్లు తేలిందన్నారు. గుజరాత్ లో 750, మధ్య ప్రదేశ్ లో 600, రాజస్థాన్ లో 750, కర్ణాటకలో 600 కోట్ల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నట్లు మంత్రి శాసన సభకు వివరించారు. మన ముఖ్యమంత్రి మానవత్వం ఉన్న వారని, అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నారన్నారు. సీఎం ఇస్తున్న పెన్షన్ల వల్ల వృద్ధులు, వికకాలంగులు, ఇతర పెన్షనర్లకు గౌరవం పెరిగిందన్నారు. జిల్లా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు, సదరన్ క్యాంపులు వంటి అంశాలను ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభకు వివరించారు.