ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ వచ్చేవారికి.. ముందస్తు అనుమతి తప్పనిసరి... అందుబాటులోకి హెల్ప్ లైన్స్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బెడ్ల కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో కరోనా పేషెంట్లు బెడ్ల కోసం అవస్థలు పడుతున్నారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్కు పొరుగు రాష్ట్రాల నుంచి తాకిడి పెరిగింది. ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు చికిత్స కోసం హైదరాబాద్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారికోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం తెలంగాణ వచ్చేవారికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. వారి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 040-2465119,9494438351 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చునని తెలిపింది.
రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న అంబులెన్సులను సరిహద్దుల్లోనే పోలీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో బెడ్ దొరికినట్లు ఆధారాలు చూపిస్తేనే వారిని అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి నుంచి ఎలాంటి లెటర్ లేనివాళ్లను తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. అనుమతి ఉన్నవారు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రానికి వచ్చి చికిత్స పొందవచ్చు.
Recommended Video
ఇక తెలంగాణలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండుపై తాజాగా కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్లో #AskKTR హాష్ ట్యాగ్తో ఆయన నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓ నెటిజన్ కోరగా... సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ వైద్య నిపుణలు సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. ఆందోళన కలిగించే వార్తలు చూడవద్దని... సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనవసర పోస్టులు చదవద్దని పేర్కొన్నారు. తగినంత వ్యాయామం చేయాలని,మానసికంగా ధృఢంగా ఉండాలని సూచించారు.