భగ్గుమన్న కోదండరాం: 'ఇప్పటివరకు ఏం పీకారు?.. మళ్లీ గెలిచి ఏం పీకుతారు?'
'ఇప్పటివరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?' అని ప్రశ్నించాలన్నారు.
వికారాబాద్: తెలంగాణలో ప్రతిపక్షాల కన్నా మిన్నగా ఆ పాత్ర పోషిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఆయన్ను అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో ఆయన దూసుకెళ్తున్నారు.
అసలు తెలంగాణలో పూర్తిగా ప్రజాస్వామిక వాతావరణమే కొరవడిందన్న రీతిలో తాజాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం లేకుండా ఆంక్షల పేరిట అడ్డంకులు సృష్టిస్తున్నారని కోదండరాం ఆరోపించారు.

2019ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 'ఇప్పటివరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?' అని ప్రశ్నించాలన్నారు. 'జయజశంకర్ సార్ స్ఫూర్తి- ఉద్యమ ఆకాంక్షలు - వాస్తవ పరిస్థితులు' పేరిట శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే పని అయిపోలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరో పోరాటం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ ఆనాడే తనతో చెప్పారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే తాము మరో పోరాటానికి సిద్దమయ్యామని తెలిపారు.
సభలను సమావేశాలను ప్రభుత్వం అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అందరికీ మాట్లాడే హక్కు కల్పించిందని, ఆ హక్కును సాధించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. శనివారం ఇదే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications