తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు తీపి కబురు
ఇకపై కొత్త టూవీలర్ లేదా కారు రిజిస్ట్రేషన్ మరింత సులభతరం కానుంది. నేటి నుంచి వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాలను (ఆర్టీఓ) సందర్శించాల్సిన అవసరం లేదు. రవాణా శాఖ "డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్" విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అధీకృత ఆటోమొబైల్ షోరూమ్లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి, పూర్తిగా డిజిటలైజ్ చేయడానికి ఈ నెల 8న తీసుకున్న విధాన నిర్ణయం మేరకు ఈ చర్య చేపట్టారు.
విజయవంతంగా పైలట్ ప్రాజెక్ట్..
రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు, శాఖ వేగంగా స్పందించి 15 రోజుల్లోనే అవసరమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. శుక్రవారం ఓ ఆటోమొబైల్ డీలర్షిప్లో ఈ వ్యవస్థను విజయవంతంగా పైలట్ ప్రాజెక్ట్లో పరీక్షించారు. ఇందులో ఒక కారును రిజిస్టర్ చేసి, ఆర్టీఓ సందర్శన లేకుండానే వినియోగదారుడికి అప్పగించారు. ఈ విజయవంతమైన ట్రయల్ తర్వాత, శనివారం నుంచి కొనుగోలు చేసే అన్ని వాహనాలకు షోరూమ్ స్థాయి రిజిస్ట్రేషన్ వర్తిస్తుందని శాఖ ప్రకటించింది.

మరింత వేగంగా, సాఫీగా..
ఈ కొత్త విధానం కింద, వాహన యజమానులు రవాణా కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోతుంది. దీంతో ఈ ప్రక్రియ వేగంగా, మరింత సాఫీగా మారుతుంది. ఇది ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి ప్రకారం, అధీకృత డీలర్ కొనుగోలుదారు తరపున శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారమ్లు 21, 22, బీమా వివరాలు, చిరునామా, వాహన ఫోటోలు వంటి తప్పనిసరి పత్రాలను డీలర్ డిజిటల్గా అప్లోడ్ చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన..
రవాణా శాఖ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తును పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబర్ను కేటాయిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) నేరుగా వాహన యజమానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. దీనివల్ల ఆర్టీఏ ఆఫీస్ ల చుట్టూ తిరిగే తిప్పలు వాహనదారులకు తప్పుతుంది. వారి సమయాన్ని ఆదా చేసినట్టవుతుంది. ఆర్టీఓల వద్ద రద్దీని తగ్గిస్తుందని, వ్యవస్థలో మరింత పారదర్శకతను, సమర్థతను తీసుకువస్తుందని అధికారులు తెలిపారు.
కమర్షియల్, ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఈ విధానం వర్తించదు..
ఈ సదుపాయం ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, కార్లతో సహా నాన్ ట్రాన్స్పోర్ట్, నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్, ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఈ విధానం వర్తించదు. రాష్ట్రవ్యాప్తంగా సాఫీగా అమలు చేయడానికి, రవాణా కమిషనర్ ఇప్పటికే 33 జిల్లాల రవాణా అధికారులతో ఆన్లైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications