వ్యక్తిగత టూరా.?అధికారిక పర్యటనా.?ఏమీ తేల్చుకోకుండానే వెనక్కి.!కేసీఆర్ పై విమర్శల వెల్లువ.!
హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వంపై యుద్దం చేస్తానని ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు యుద్దం చేయకుండానే కదనరంగాన్ని వదిలేసి వెనుదిరిగారు. ఏమీ తేల్చుకోకుండానే ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన చంద్రశేఖర్ రావు నాలుగు రోజుల పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం చద్రశేఖర్ రావు వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లారా? లేక అధికారికంగా వెళ్లారా? అని నిలదీస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై తాడోపేడో తేల్చుకుని వస్తానని సవాల్ విసిరి చివరికి ఉసూరుమంటూ తిరిగొచ్చారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్రంతో యుద్దం అన్న సీఎం.. యుద్దం చేయకుండానే వెనుదిరిగిన కేసీఆర్
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో సమరశంఖారావం పూరించి చీఫ్ సెక్రటరీ సహా మంత్రులను కూడగట్టుకుని ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఎవరితో భేటీ కాకుండానే ఏమీ తేల్చుకోకుండానే తిరిగి వచ్చారు. ఢిల్లీ వెళ్లే ముందు విలేఖరుల సమావేశం నిర్వహించి చంద్రశేఖర్ రావు చెప్పిన అంశాలకు, చేసిన ప్రకటనలకు, ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ఏమాత్రం పొంతనే లేకపోవడంతో చంద్రశేఖర్ రావు పర్యటనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రశేఖర్ రావు నాలుగు రోజులుగా ఢిల్లీలో ఏం చేశారు.? వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం పైన ఒత్తిడి తెచ్చారా.?లేదా? అసలు కేంద్ర మంత్రులను గానీ ప్రధాన మంత్రిని గానీ అపాయింట్ మెంట్ అడగకపోవడానికి కారణం ఏంటని విపక్షాలు నిలదీస్తున్నాయి.
ఢిల్లీ పర్యటన అంతా డ్రామా.. నాలుగుకోట్ల ప్రజలను కేసీఆర్ మోసం చేసారన్న ప్రతిపక్షాలు
యాసంగి సీజన్లో రైతులు వేయబోయే పంటల అంశంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకుంటానని, ఆ తర్వాతనే రైతులకు భరోసా ఇవ్వగలనని, సమగ్ర సాగు ప్రణాళిక రూపొందించుకోవడం కేంద్రంతో సంప్రదింపుల తర్వాత సాధ్యమవుతుందని సీఎం ఢిల్లీ వెళ్లే ముందు రోజు పాత్రికేయుల సమావేశంలో వివరించారు. కేంద్రం ఎంత త్వరగా తేలిస్తే రైతులకు అంత ఉపశమనం ఉంటుందని కూడా పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశం ఎజెండా ప్రాతిపదికనే ఢిల్లీ వెళ్లినప్పటికీ ఆశించిన చర్చలు చోటుచేసుకోలేదు. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన భేటీకి చంద్రవేఖర్ రావు హాజరుకాలేదు. ప్రధానమైన సమస్య అని చెప్తూనే దానిపై చర్చించడానికి ఎందుకు చొరవ తీసుకోలేదని, కేవలం మంత్రుల్ని, అధికారులను మాత్రమే పంపి తాను గైర్హాజరు కావడానికి కారణలేంటనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి.
నాలుగు రోజులున్నా నాలుగు గోడల మధ్యనే.. ఎవరితోనూ సమావేశం కాని సీఎం.!
రాష్ట్రానికి సంబంధించిన జల వివాదాల మొదలు విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు, కేంద్ర ప్రభుత్వ హామీలపై ఢిల్లీ పెద్దలందరినీ సంప్రదిస్తానని చంద్రశేఖర్ రావు చెప్పుకొచ్చారు. కానీ చంద్రశేఖర్ రావు విలేఖరుల సమావేశంలో చెప్పినట్టు ఏమీ జరగలేదు. కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి మోదీని కలువకుండానే చంద్రవేఖర్ రావు హైదరాబాద్కు తిరిగొచ్చారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా, చంద్రశేఖర్ రావు అధికారికంగా ఎవరినీ కలవలేదు. అధికారిక పర్యటన కోసమే వెళ్లారా? లేకా వ్యక్తిగతమా? అని ప్రశ్నిస్తున్నారు. అపాయింట్ మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికి కేంద్రమంత్రులు తిరస్కరిస్తున్నారని, అసలు చంద్రవేఖర్ రావు ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
దీదీకి అపాయింట్మెంట్ ఇచ్చిన మోదీ.. మరి కేసీఆర్కు ఇవ్వకపోడానికి కారణాలేంటి ?
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావుకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చి నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. మమతా బెనర్జీకి అడిగి వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చి చంద్రవేఖర్ రావు ను మాత్రం దూరం పెట్టారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతంలో చంద్రశేఖర్ రావు తో సమావేశాల వల్ల తెలంగాణ బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని తెలిసి కూడా భేటీలు నిర్వహించారు. అలాంటిది ఇప్పుడు ఎందకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనే అంశంపై తెలంగాణ రాజకీయ నేతలు చర్చించికుంటున్నారు.
వ్యక్తిగత పనుల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మండిపడుతున్న ప్రతిపక్షాల నేతలు
చంద్రవేఖర్ రావు ఢిల్లీ పర్యటన ఉద్దేశం వరి కొనుగోలు అంశం కాదని, మరేదో వ్యక్తిగత కారణం ఉండి ఉంటుందని మరికొంత మంది రాజకీయ నేతలు స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వంటి వారు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. సీఎం చంద్రవేఖర్ రావు ఢిల్లీ టూర్ వ్యవహారం మొత్తం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కుదిరిన ఓ మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈ రెండు పార్టీలూ కలిసి ఆడుతున్న నాటకం అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రవేఖర్ రావు ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఆయన సతీమణి వైద్య పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లారని, బహుశా ఆమె ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత శ్రద్ద చూపించడం కోసమే ఢిల్లీ వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటన పరిణామాలపై టీఆర్ఎస్ నేతలు కూడా ముభావంగా వ్యవహరించడం కొసమెరుపు.