ఫోన్ పే డబ్బుల కోసం స్నేహితుడి గొంతు కోసిన దారుణం!
సమాజంలో చిన్న చిన్న విషయాలకే హత్యలు జరుగుతున్న ఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. తాజాగా ఫోన్ పే డబ్బుల కోసం స్నేహితుడిని దారుణంగా హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లిలో జరిగిన ఈ ఘటనలో జరిగిన దారుణం వివరాలలోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లిలో ఒక చిన్న వివాదం పెద్ద దారుణంగా మారింది. ఫోన్పే ద్వారా వచ్చిన కొద్ది డబ్బుల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. శనివారం ఎంఆర్ఎఫ్ పరిశ్రమ ఎదుట ఈ ఘటన జరిగి స్థానికుల్లో కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన రాహుల్, నీరజ్ ఇద్దరూ ఇక్కడి ఒక పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు.

ఒకే గదిలో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో నీరజ్ కుటుంబ సభ్యులు రాహుల్ ఫోన్పే ఖాతాకు కొంత డబ్బు పంపారు. ఆ డబ్బును తనకు ఇవ్వాలని నీరజ్ రాహుల్ను అడిగాడు. కానీ రాహుల్ తన మొబైల్ రిపేర్లో ఉందని, ఇప్పుడు డబ్బులు తీసి ఇవ్వలేనని చెప్పాడు. ఈ మాటలపై నీరజ్ పలుమార్లు నిలదీశాడు. మాటలు పెరిగి వాగ్వాదం తీవ్రమైంది. ఆగ్రహంతో నీరజ్ గదిలో ఉన్న కత్తిని తీసుకుని రాహుల్ గొంతు కోశాడు.
తీవ్రంగా గాయపడిన రాహుల్ అక్కడికక్కడే మరణించాడు. ఘటన తర్వాత నీరజ్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సదాశివపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పరారీలో ఉన్న నీరజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. చిన్న డబ్బు విషయం ఇంత దారుణానికి దారి తీయటంతో స్థానికులు షాక్ కు గురయ్యారు . స్నేహితుల మధ్య ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా చర్చకు కారణం అయ్యింది. పోలీసులు నిందితుడిని త్వరలో పట్టుకుంటారని స్థానికులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications
