వావ్.. హైద్రాబాద్ అనేలా: కేసీఆర్, చార్మినార్తో హైటెక్ సిటీకి పోలికనా?
హైదరాబాద్: చారిత్రక ఆనవాళ్లు చెరిగిపోకుండానే హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలోనే అగ్రశ్రేణి నగరంగా, ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించారు. ఈ విషయంలో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో గురువారం ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారు. తన ఆకాంక్షల మేరకు హైదరాబాద్లో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించారు.
కొత్త కట్టడాల నిర్మాణం కోసం మ్యాప్లు, గూగుల్ ఎర్త్ చిత్రాలను పరిశీలించారు. మూసీ చుట్టు పక్కల ప్రాంతాల్లో చేపట్టాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా హఫీజ్ బృందానికి పలు సూచనలు చేశారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ కళా భారతి పేరుతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు.

నాలుగు ఆడిటోరియంలు, విశాలమైన పార్కింగ్ ఏరియా ఉండేలా నమూనా తయారు చేయాలన్నారు. ఒక ఆడిటోరియంలో 2000-3000 మంది, మరో దానిలో 1500, మూడో ఆడిటోరియంలో 1000 మంది, నాలుగవ దానిలో 600 మంది పట్టేలా డిజైన్ చేయాలని సూచించారు. ప్రస్తుతం రవీంద్ర భారతి ఉన్న ప్రాంతంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను చాటేలా ఒక ప్రత్యేక కట్టడం రావాలని సీఎం చెప్పారు.
మొజాంజాహి మార్కెట్, చార్మినార్ ప్రాంతం, హుస్సేన్సాగర్ చుట్టు ప్రక్కల, సాలార్జంగ్ మ్యూజియం ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు వన్నె తెచ్చేలా ఆవరణలు తయారు చేయాలన్నారు. వాటి ప్రాముఖ్యత ఏ మాత్రం దెబ్బతినకుండా, వాటికి అనుబంధంగా మరిన్ని నిర్మాణాలు రావాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మూసీకి రెండు వైపులా అద్భుతమైన పార్కులు, పార్కింగ్ ప్లేస్లు రావాలన్నారు.
మూసీ, ఈసీ నదుల ప్రాంతాన్ని చాదర్ఘాట్ నుంచి లంగర్హౌస్లోని బాపూఘాట్ దాకా సర్వే చేసి అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉందో తేల్చాలని ఆదేశించారు. ఆ తర్వాత మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనుల కోసం ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సాలార్జంగ్ మ్యూజియంను అంతర్జాతీయ స్థాయి మ్యూజియంగా తీర్చి దిద్దాలని ఆదేవించారు.

హైదరాబాద్ నగరమంతా ఒకే రకంగా లేదని, నిర్దిష్టంగా ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, సామాజిక పరిస్థితుల ఆధారంగా కొత్త నిర్మాణాలు రావాలని, అందుకు తగినట్లుగా భిన్నమైన డిజైన్లు రూపొందించాలి చెప్పారు. హైదరాబాదును వాహ్.. హైదరాబాద్ అనేలా తీర్చిదిద్దుతామని, ప్రపంచ దర్శనీయ స్థలాల్లో నిలిచిపోవాలన్నారు. అద్భుత కట్టడాలతో హైదరాబాదు కీర్తిని పెంచుతామన్నారు. చార్మినార్తో హెటెక్ సిటీకి పోలిక లేదన్నారు.
మూసీ నదికి దక్షిణ భాగంలో ఉన్న ఓల్డ్ సిటీ, ఉత్తర భాగంలో ఉన్న న్యూ కమ్ ఓల్డ్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్లాంటి ప్రాంతాలతో కూడిన కొత్త నగరం, పారిశ్రామిక వాడలు ఉన్న ప్రాంతాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, హెచ్ఎండీఏ పరిధిలోని శివారు కాలనీలు, మురికి వాడలు... వేర్వేరుగా ఉన్నాయన్నారు. వాటికి అనుగుణంగానే ప్రణాళికలు తయారు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications