అక్రమ భూదందాలు: నకిలీ పత్రాల ముఠా పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: భూ ఆక్రమణల దందా గుట్టు రట్టయింది. భూములకు సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకతను రిటైర్డ్ డిప్యూటీ ఎమ్మార్వో కావడం విశేషం.
సికింద్రాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో టాస్క్ఫోర్స్ డిసిపి బి.లింబారెడ్డి ఆ ముఠా దందా వివరాలను వెల్లడించారు. భూమికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూఅక్రమణదారులు, కోర్టులో భూమి కేసులకు సంబంధించిన వారికి అందజేసి సోమ్ము చేసుకుంటున్న ముఠా వివరాలను ఆయన వెల్లడించారు.
హైదరాబాదులోని యూసుఫ్గుడ వెంకటగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎం.రామోహన్రావు ఆలియాస్ మోహన్దాస్ స్వామి(72) ఈ ముఠా ప్రధాన సూత్రదారి. కొంత కాలంగా రామ్మోహన్ రావు భూ అక్రమణదారులతో కుమ్ముకై వారికి కావల్సిన నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నాడు.
ఈ నకిలీ పత్రాలకు సంబందించిన కేసులో హైమచౌదరి కూకట్పల్లి, బంజారాహిల్స్ పోలీస్టేషన్లలో అక్రమ భూకబ్జా కేసులో జైలుకు వెళ్లింది. కేసులులో అరెస్టయిన వారిలో రాంమోహన్రావు, రామానుజరావు, మహ్మద్ ఎయిజాజ్ అహ్మద్, మహ్మద్ కరీముద్దిన్ ఉండగా మరో ఇద్దరు హైమచౌదరి, బంజారాహిల్స్ నందినగర్లో నివాసం ఉంటున్న ఎన్.అశోక్(39) ప్రస్తుతం ఇతర కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

రిటైర్డ్ డిప్యూటీ ఎమ్మార్వో
వివిధ మండలల్లో డిప్యూటీ ఎమ్మార్వోగా పని చేసిన అనుభవం గల దిలుసుఖ్నగర్ గడ్డిఅన్నారం త్రివేణి కాలనీలో నివాసం ఉంటున్న రామానుజరావు(70) రెవిన్యూ శాఖలో పనిచేసి పదవీ వరమణ పొందారు. ముఠాలో ప్రధాన నిందితుడైన రామోహన్రావుకు రెవిన్యూ శాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన రామానుజరావుతో పరిచయం ఏర్పడింది.

భూముల వివరాలు ఇలా అందించాడు..
రామానుజరావు షేక్పేట్, గోల్కొండ మండలం పరిధిలోని విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు సంబంధించిన భూముల వివరాలు, షేక్పేట్ మండలానికి చెందిన భూముల వివరాలతో పాటు పహాణీబుక్స్, పట్టాదార్ పాస్బుక్స్, విలేజ్కి చెందిన ప్లాన్స్ సేకరించాడు. దీంతో రాంమోహన్రావుతో కలిసి భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి భూములను విక్రయిస్తున్న భూకబ్జాదారులకు సహకరిస్తున్నారు.

భూవివరాలతో ఇలా..
రాంమోహన్రావు, రామనుజరావు కలసి సేకరించిన భూముల వివరాల ప్రకారం పాతబస్తీ హుస్సేని ఆలం ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ అజీజ్ అహ్మద్(55) చెత్తబజార్లో ఓ షాపును ఏర్పాటు చేసి అక్కడ డాక్యుమెంట్లకు సంబంధించి ట్రాన్స్లేట్ చేయడంతో పాటు పాత టైప్ రైటింగ్ మిషన్పై వివరాలను టైప్ చేసి ఇచ్చేవాడు.

నిజాం కాలంనాటి స్టాంప్ పేపర్లు
ముఠాలో ఎంతో తెలివిగా వ్యవహరించిన ఆజీజ్ అహ్మద్ నిజాం కాలం నాటి స్టాంప్ పేపర్స్, ప్రభుత్వానికి చెందిన వివిధ సబ్ రిజిస్ట్రార్ల నకిలీ రబ్బర్ స్టాంపులను సృష్టించి డాక్యుమెంట్లను తయారు చేసి రాంమోహన్రావుకు ఇచ్చేవాడు.

వెడ్డింగ్ కార్డుల తయారీ నుంచి..
నాలుగో నిందితుడు మహ్మద్ కరీముద్ధిన్(55) హుస్సేని ఆలంలోని ఆజాం ఆసుపత్రి సమీపంలో వెడ్డింగ్ కార్డులను తయారు చేస్తుంటాడు. పైన పేర్కొన్న ముగ్గురు వద్ద సేకరించిన డాక్యుమెంట్లను వివిధ స్టాంప్స్ పేపర్లపై ఉర్దూలో చిత్రికరించి పాత భూమి డాక్యుమెంట్ల మాదిరిగా తిర్చిదిద్దేవాడు.

నకిలీ పత్రాలను కాజేసేందుకు ప్రయత్నం..
హైదరాబాదులోని మోహిదిపట్నం అత్తపుర్ ప్రాంతానికి చెందిన కర్ల హైమవతమ్మ అలియాస్ హైమచౌదరి(69) నకలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్న ముఠాతో కలిసి మల్కాజిగిరి, బంజారాహిల్స్, అత్తాపుర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన భూములను నకిలీ డాక్యుమెంట్లతో కాజేసేందుకు ప్రయత్నించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి నిజమైన భూమి కలిగిన పట్టాదార్లను మోసం చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన టాస్క్ఫోర్స్, వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ టీమ్ సభ్యులను డిసిపి లింబారెడ్డి అభినందించారు.
ఈ కేసుకు సంబంధించి నిందితుల నుంచి 16 నకిలీ డాక్యుమెంట్లు, 232 రెవిన్యూ, సబ్ రిజిస్ట్రార్కు చెందిన రబ్బర్ స్టాంప్లు, నిజాం కాలానికి చెందిన వాటితో పాటు పాత నాన్ జూడిషియల్ స్టాంప్ పేపర్లు, భూములకు సంబంధించిన పహాణీలు, రెవెన్యూ స్టాంప్లు, పట్టాదార్ పాస్బుక్స్, లామినేట్ ఫాయిల్స్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications