హైదరాబాద్లో సినీ ఫక్కీలో చేజింగ్, ఫైరింగ్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో భారీ చోరీకి చేసిన కుట్రను టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ముందస్తు సమాచారంతో మాటు వేసిన పోలీసులు నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని నీరూస్ వస్త్రదుకాణం వద్ద వారిని వెంటాడి పట్టుకున్నారు.
పోలీసులు తరుముతున్న క్రమంలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో సమీపంలో మెట్రో రైల్ పనుల్లో ఉన్న ఒక కార్మికుడి శరీరంలోనుంచి తూటా దూసుకుపోయింది. ప్రస్తుతం అతడికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సినిమా ఫక్కీలో క్షణాల వ్యవధిలో జరిగిన ఈ చేజింగ్, ఫైరింగ్ సంఘటనలతో స్తానికులు బిత్తరపోయారు. పోలీసులు కర్ణాటకకు చెందిన ఇద్దరు దొపిడీ దొంగలను పట్టుకున్నారు. తద్వారా భారీ చోరీకి జరిగిన కుట్రను ఛేదించారు.

పోలీసులకు సమాచారం..
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన ఇద్దరు దోపిడీ దొంగలు హైదరాబాద్లోని షాపింగ్మాల్స్, మొబైల్ కలెక్షన్స్ కేంద్రాలనుంచి డబ్బులు తీసుకువెళ్లే కలెక్షన్ ఏజెంట్లను గుర్తించి, వారిని దోచుకునే ప్లాన్తో ఇటీవల నగరానికి వచ్చారని టాస్క్పోర్స్ పోలీసులకు సమాచారం అందింది.

పాతబస్తీవాసుల సహకారం..
ఆ ఇద్దరికి నగరంలోని పాతబస్తీకి చెందిన మరికొంతమంది సహకారం అందిస్తున్నారని పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు రెండురోజులుగా వీరికోసం గాలింపు కొసాగిస్తున్నారు.

రంగంలోకి ఇలా..
గురువారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోకి ఇద్దరు దోపిడీ దొంగలు వచ్చారన్న సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు మాదాపూర్నుంచి జూబ్లీహిల్స్కు వెళ్లే దారిలో మాటువేశారు.

నీరూస్ కూడలి వద్ద..
నీరూస్ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండటంతో వారి బైక్ స్లో కావచ్చని భావించిన పోలీసుల అంచనా నిజమైంది. అయితే అదే సమయంలో పోలీసులను ముఠాసభ్యులు గమనించారు.

ముఠా సభ్యులు ఇలా..
పోలీసుల కదలికలను గమనించిన ముఠా సభ్యులు ఫయీం, ఖాదర్లు వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫయీం బైక్ పై ఉండగానే ఒడిసిపట్టుకుని లాగారు.

ఫయీం కాల్పులు
కిందపడిన ఫయీం తన వద్ద ఉన్న తపంచాతో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే అది కాస్తా గురి తప్పి దారిన నిలబడిన ధర్మేంద్ర అనే మెట్రోరైల్ కార్మికుడికి తాకింది.

పెనుగులాట..
ఘర్షణలో కాసేపు ఫయీంకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. సమీపంలోని నీరూస్లో పనిచేసే కొంతమంది సిబ్బంది కూడా పోలీసులకు సహకరించడంతో నిందితుడు ఫయాంను కిందపడేసి అదుపులోకి తీసుకున్నారు.

మరో నిందితుడిని ఇలా..
ఆ తర్వాత అక్కడికి చేరుకున్న మిగిలిన పోలీసులు కావూరిహిల్స్వైపు పారిపోతున్న మరో నిందితుడు ఖాదర్ను వెంబడించి పట్టుకున్నారు. బుల్లెట్ గాయమయిన ధర్మేంద్రను కిమ్స్ దవాఖానకు తరలించారు.

మహేందర్ రెడ్డి పరిశీలన..
ఘటనా స్థలాన్ని నగరపోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి పరిశీలించారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

కోలుకుంటున్న కార్మికుడు
దోపిడీ దొంగ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ మెట్రో కార్మికుడు ధర్మేంద్ర ఆరోగ్యపరిస్థితి మెరుగ్గా ఉందని కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications