చండీయాగంలో కెసిఆర్ దంపతులు: ప్రత్యేక పూజలు (పిక్చర్స్)
హైదరాబాద్: సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఇబ్రహీంపట్నం సుభిక్షంగా ఉండాలని కోరుతూ శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి చేపట్టిన శతచండీయాగం గురువారం ముగిసింది. తొమ్మిది రోజుల పాటు విజయవంతంగా సాగిన ఈ యాగానికి చివరిరోజు గురువారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దంపతులు విచ్చేశారు.
వారంరోజుల పాటు నిర్వహించిన శత చండీయాగానికి వివిధ పార్టీల నాయకులు ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. చివరిరోజు ముఖ్యమంత్రి హాజరవుతున్నారని తెలుసుకొని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్ నాయకులు, జనం హాజరయ్యారు.
చివరిరోజు కార్యక్రమంలో టీ న్యూస్ ఎండీ సంతోష్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మలిపెద్ది సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్రెడ్డి, వంగేటి లకా్ష్మరెడ్డి, కొత్త మనోహర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, నిరంజన్రెడ్డి,రమేష్గౌడ్, మొద్దు అంజిరెడ్డి, జేపీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ దంపతులు
శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిర్వహించిన శత చండీయాగానికి వచ్చిన కెసిఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
సాదర స్వాగతం
హెలిక్యాప్టర్లో హైదరాబాద్ నుంచి ఎలిమినేడుకు చేరుకున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే మంచిరెడ్డి దంపతులు స్వాగతం పలికి యాగశాలకు తీసుకువెళ్లారు.
గంటన్నర సేపు పూజలు..
గంటన్నర సేపు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ అనంతరం తిరిగి మధ్యాహ్నం హైదరాబాద్కు వెళ్లిపోయారు.
యాగం విశేషాలు అడిగారు...
ప్రత్యేక పూజలు నిర్వహించిన కెసిఆర్ యాగం విశేషాలను పండితులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు సీఎంకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
తొమ్మిది రోజుల పాటు
గతనెల 25న మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేపట్టిన యాగం తొమ్మిది రోజులపాటు విజయవంతంగా సాగింది. తెలుగు రాష్ర్టాల్లోని పలు ఆలయాల నుంచి వచ్చిన వేదపండితులు నిత్యం వందసార్లు చండీపారాయణం, వందసార్లు హోమం నిర్వహించారు. అలాగే సర్వతో భద్రత మండలం దేవతల పూజలు చేశారు
అందరికీ కృతజ్ఝతలు
తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన శత చండీయాగానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే చండీయాగానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
సమృద్ధిగా వర్షాలు కురవాలని...
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని నిర్వహించిన శత చండీయాగం విజయవంతంగా పూర్తి కావడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.