జర్నలిస్టులందరికీ ఇళ్లు: కెసిఆర్ చొరవతో కుదిరిన సయోధ్య (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్లో పనిచేసే జర్నలిస్టులందరికీ వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. జర్నలిస్టుల కోసం నిర్మించే ఇళ్ల కోసం బడ్జెట్లోనే ప్రత్యేకం గా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
మొదటి దశ లో హైదరాబాద్, వరంగల్ జిల్లాలో ఇండ్లు నిర్మిస్తామన్న చెప్పిన ముఖ్యమంత్రి దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో రెసిడెన్షియల్ టవ ర్లు నిర్మిస్తామని తనను కలిసిన జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాల నాయకులకు స్పష్టం చేశారు.
శుక్రవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్టులు కె. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, బుద్ధా మురళి, శైలేష్రెడ్డి, వీ సతీష్, వై నాగేశ్వర్రావు, క్రాంతి, పల్లె రవి, చైతన్యవర్మ, రమేశ్ హజారీ, వెంకటాచారి, బసవపున్నయ్య తదితరులు క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ను కలిశారు. ముఖ్యమంత్రి చొరవతో రెండుగా చీలిపోయిన జర్నలిస్టులు ఏకమయ్యారు.
హామీ నెరవేరుస్తాం..
గతంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల టౌన్షిప్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని సీఎం ఆదేశించారు.
ఏడాదిలోగా పూర్తి...
అధికారులు, జర్నలిస్టు నాయకులు శనివారం నగరం లో పర్యటించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని కోరా రు. మార్చిలో శంకుస్థాపన చేసి, ఏడాదిలోగా ఇండ్ల నిర్మా ణం పూర్తి చేయాలనేది తమ ఆలోచన అని సీఎం వెల్లడించారు.
సొసైటీల రద్దుకు సముఖం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వయంగా ఇండ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం గతంలో ఏర్పడిన సొసైటీలను రద్దు చేసుకోవడానికి జర్నలిస్టు సంఘాల నాయకులు అంగీకరించారు. సొసైటీల ద్వారా జర్నలిస్టులు గతంలో ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
జర్నలిస్టులకు ఇళ్లు ఉండాలి...
ప్రతీ జర్నలిస్టుకు సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని తనను కలిసిన జర్నలిస్టులతో సీఎం కేసీఆర్ అన్నారు. సమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టుల కుటుంబాలకు, పిల్లలకు ఇల్లు రూపంలో ఒక ఆస్తి మిగలాలనేది తమ ఉద్దేశమని సీఎం చెప్పారు.
వంద ఎకరాలు...
పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే బ్యూరో, డెస్క్, ఫోటో, వీడియోలాంటి విభాగాల జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులందరికీ ఒకే చోట ఇండ్లు నిర్మించడానికి దాదాపు 100 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు.