పోలీసు కార్డోన్ సెర్చ్: చుట్టుముట్టి పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: సైబారాబాద్ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడాన్ని క్రమం తప్పకుండా పెట్టుకున్నారు. నిఘా విభాగం సమాచారం మేరకు పోలీసులు హైదరాబాద్ చుట్టుపక్కల నేరగాళ్లకు నిలయాలుగా మారిన 12 ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఆ ప్రాంతాల్లోకి ఉగ్రవాదులూ తీవ్రవాదులు చొరబడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ పరిసరాల్లోని ప్రధానంగా పారిశ్రామిక వాడలు నేరగాళ్లకు అడ్డాలుగా మారాయనే భావన నెలకొని ఉంది. ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు కూడా ఉంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తాత్కాలికంగా ఆశ్రయం తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాలను చుట్టుముట్టి దాడులు చేస్తారు.
స్నేక్ గ్యాంగ్ ఆగడాల నేపథ్యంలో తాజాగా హైదరాబాదు పాతబస్తీలోని పహడీషరీఫ్ ప్రాంతంలో కార్డోన్ ఆపరేషన్ నిర్వహించారు. ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా, తాము ఎంచుకున్న ప్రాంతాలను చుట్టుముట్టి ఎవరూ బయటకు వెళ్లకుండా దారులు మూసేసి సోదాలు నిర్వహిస్తారు.
ఆగస్టు తొమ్మిదో తేదీ మైలార్దేవ్పల్లి, పహాడిషరీఫ్లోని శ్రీరాం కాలనీలో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు పాత నేరస్థులను, ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసి 17ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 23న జవహర్నగర్లోని గబ్బిలాలపేటలో ఆపరేషన్ నిర్వహించి పది మంది అనుమానితులను అరెస్టు చేసి 32 మోటారు సైకిళ్లు, ఏడు ఆటోలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
సూరారం కాలనీలో ఆపరేషన్
జూలై 16 అర్ధరాత్రి దుండిగల్లోని సూరారం కాలనీని వలయంలో బంధించి 20 మోటారు సైకిళ్లు, పది ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పది మంది పాత నేరస్థులను, 11మంది అనుమానితులను అరెస్టు చేశారు.
సూరారం కాలనీలో ఇలా...
సూరారం కాలనీని చుట్టుముట్టి పోలీసులు ఆకస్మిక దాడి చేసి సోదాలు నిర్వహించి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పాపిరెడ్డి కాలనీలో ఇలా..
ఆగస్టు 3న చందానగర్లోని పాపిరెడ్డి కాలనీలో కార్డన్సెర్చ్ నిర్వహించి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 27 మోటారు సైకిళ్లు, పది ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
పాపిరెడ్డి కాలనీలో వాహనాలు
చందానగర్లోని పాపిరెడ్డి కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం విశేషం.
పహడీషరీఫ్లో స్నేక్ గ్యాంగ్
స్నేక్ గ్యాంగ్ ఆగడాలు బయటపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో ఆకస్మిక దాడి చేసి సోదాలు నిర్వహించారు. పలు వాహనాలను, గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా..
స్నేక్ గ్యాంగ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిన నేపథ్యంలో ప్రజల్లో మనో ధైర్యం నింపడానికి, పోలీసులకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా కార్డోన్ ఆపరేషన్లో పాల్గొన్నారు.