పల్టీ కొట్టి కార్లను ఢీకొట్టిన కారు: కార్లన్నీ తుక్కు తుక్కు(పిక్చర్స్)
హైదరాబాద్: పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే ఫ్లెఓవర్పై హైదరాబాదులోని ఆరాంఘర్ నుంచి వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీకొట్టి కుడి వైపు నుంచి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో మోహిదీపట్నం వైపు ఆరాంఘర్ వైపు వస్తున్న మరో రెండు కార్లను కూడా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ వాహనాలు ధ్వంసమయ్యాయి. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం....ఆరాంఘర్ వైపు నుంచి పీవీఎన్ఆర్ వే ఫ్లెఓవర్పై వేగంగా వచ్చిన విస్టా కారు పిల్లర్ 232 వద్ద పల్టీ కొట్టింది.
అదే సమయంలో కూడివైపు నుంచి(మోహిదీపట్నం) వస్తున్న పోలోకారును ఢీకొట్టడంతో అందులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న రామాంతపూర్కు చెందని పాండు, శ్రీకాంత్లతో పాటు డ్రైవర్లు తీవ్ర గాయాలయ్యాయి.
కార్లు ధ్వంసం..
మోహిదీపట్నం నుంచి వస్తున్న ఇన్నోవా కారు, మరో కారు సైతం ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పల్టీకొట్టిన విస్టాకారు పోలోకారును ఢీకొని మళ్లీ ఎడమైపున విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పడిపోయింది. ఈ కారును నడుపుతున్న సల్మాన్కు సైతం తీవ్రగాయమైంది. ఇన్నోవా కారు (ఏపీ 09 బీఎం 0468)వెనుకాలే వచ్చిన మరో కారు కూడా కొద్దిగా ధ్వంసమైంది.
ఒక్కదాని తర్వాత మరోటి..
ఈ ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు పోలీస్స్టేషన్కు సమాచారం అందించడంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో పాటు ఎస్సై శ్రీనివాస్ ఇతర సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గాయాలకు గురైన వారిని 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రాణనష్టం లేదు..
ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పల్టీకొట్టిన వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మిగిలిన వాహనాలు సగం వరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదాన్ని పరిశీలిస్తే అతివేగం వల్లనే జరిగినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ స్తంభన..
ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్పై ఇరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తన సిబ్బంది వచ్చి అరగంట పాటు శ్రమించి ఇరువైపుల నుంచి వాహనాలను అదుపుచేశారు.
తొలగించిన తర్వాత క్లియర్...
ట్రాఫిక్ను క్లీయర్ చేయడంతో పాటు ధ్వంసమైన కార్లను క్రేన్ల సహాయంతో తొలిగించారు. కేసు దర్యాప్తులో ఉంది.