ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర: ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు: అలాంటి వస్తువులు ఉంటే.. !
హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేడారం జాతరకు సన్నాహాలు పూర్తయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఈ గిరిజన పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను పూర్తి చేసింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా చర్యలు చేపట్టింది.

లక్షలాది మంది భక్తులు..
ములుగు జిల్లాల్లో రెండేళ్లకోసారి జరిగే మహా జాతరను గిరిజన సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు గిరిజనుల జనాభా అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ నుంచి లక్షలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారని జిల్లా పాలనా యంత్రాంగం అంచనా వేస్తోంది. మేడారం జాతరలో భాగమైన గుడిమెలిగె కార్యక్రమాన్ని రెండురోజుల కిందటే పూర్తి చేశారు. మడిమెలిగె కార్యక్రమాన్ని 28న నిర్వహించనున్నారు.

ప్లాస్టిక్ రహితంగా..
సమ్మక్క, సారలమ్మ జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించడానికి జిల్లా పాలనాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భక్తులు తమ వెంట ప్లాస్టిక్ వస్తువులను తీసుకుని రాకూడదని ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ములుగు జిల్లావ్యాప్తంగా దీనికి సంబంధించిన బ్యానర్లను కట్టారు. కరపత్రాలను పంచుతున్నారు. దీనితో పాటు జాతరకు వెళ్లే మార్గాలో పలు చోట్ల ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలను నెలకొల్పారు. రౌండ్ ద క్లాక్ తరహాలో ఈ కేంద్రాలు పని చేస్తాయి.

ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకుంటున్న సిబ్బంది..
జాతరకు వెళ్లే అన్ని వాహనాలను కూడా సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. భక్తుల వద్ద ప్టాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు, ప్టాస్టిక్ బాటిళ్లు ఇప్పటికే పెద్ద ఎత్తున పోగయ్యాయి. ప్లాస్టిక్ వస్తువుల వల్ల జంపన వాగు, అమ్మవార్ల సన్నిధి.. ఇవన్నీ పెద్ద ఎత్తున కాలుష్యమయమౌతున్నాయని అధికారులు చెబుతున్నారు. జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తమ వెంట తెచ్చకుంటే స్వచ్ఛందంగా అందజేయాలని సూచిస్తున్నారు.

ఈ సారి జాతరకు రూ.75 కోట్లు..
జాతరకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తంతో మంచినీటి సౌకర్యం, విద్యుత్, రోడ్ల మరమ్మతులను చేపట్టారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాల కోసం స్నాన ఘట్టాలు, షవర్లు, కల్యాణకట్టలు నిర్మించారు. జాతరను నిత్యం పర్యవేక్షించడానికి 400 సీసీ కెమెరాలను అమర్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు.












Click it and Unblock the Notifications