ప్లీజ్ జగన్ అక్రమాస్తుల కేసు నుంచి నా పేరు తొలగించండి.! నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్.!
హైదరాబాద్ : వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబందించిన అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుతో సంబంధం ఉన్న వివిధ రంగాల ప్రముఖులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరు తొలగించాలని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. భూసేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు, రైతులకు తాము నగదు చెల్లించినట్లు తెలిపారు. ఇదే పిటిషన్ పై శనివారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. వైయస్సార్ సీపి అధ్యక్షుడు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినందుకు, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందలేదని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరు తొలగించాలని కోర్టును కోరారు
ఇందుకు అనుగుణంగా నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ చేపట్టారు. ఉచితంగా పొందితే ప్రయోజనాలు పొందినట్లవుతుంది కానీ, తాము వాన్ పిక్ ప్రాజెక్టు కోసం 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు. భూసేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు, రైతులకు తాము నగదు చెల్లించినట్లు తెలిపారు. రైతులకు నగదు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తే, నిధులు మళ్లించారని సీబీఐ ఆరోపిస్తోందని నిమ్మగడ్డ వాదించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13వేల ఎకరాలు సేకరించడం గొప్ప విషయమని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువగా చెల్లించామన్నారు నిమ్మగడ్డ. ప్రాజెక్టును బూట్ పద్ధతిలో నిర్వహించాలని అవగాహన ఒప్పందంలో ఎక్కడా లేదని నిమ్మగడ్డ ప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. వాన్ పిక్ ప్రాజెక్టులపై ప్రభుత్వం కానీ, రాక్ కానీ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదన్నారు. ఈ పిటిషన్ పై శనివారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.