తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి దొరికిన మరో వెంకయ్య..!!
హైదరాబాద్: భారతీయ జనత పార్టీ జాతీయ కార్యవర్గం రెండో రోజు సమావేశమైంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కన్వెన్షన్ హాలులో ఈ భేటీ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధ్యక్షులు, జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు.
టీడీపీ అధికారంలోకి రావాలంటే- ఆ 25 నియోజకవర్గాలపైనే చంద్రబాబు ఫోకస్
9 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో..
ఏపీ నుంచి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ నుంచి బండి సంజయ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, పార్టీ మేనిఫెస్టో రూపకల్పన వంటి అంశాలపై ఇందులో చర్చిస్తోన్నారు. తెలంగాణ సహా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ లల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగాల్సి ఉంది.
ప్రసంగించనున్న మోదీ..
వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం సెమీ ఫైనల్స్ గా భావిస్తోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. వివిధ తీర్మానాలను కూడా ఆమోదించనుంది. సమావేశం ముగింపు సందర్భంగా ఈ సాయంత్రం ప్రధాని మోదీ, అమిత్ షా ప్రసంగించనున్నారు. క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.
ఏపీ, తెలంగాణపై..
తొలి రోజు భేటీలో ఏపీ, తెలంగాణ రాజకీయ స్థితిగతులు చర్చకు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఈ తొమ్మిది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉన్న నేపథ్యంలో.. మోదీ, అమిత్ షా ఫోకస్ పెట్టారు. ఇక్కడ అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితిని ఓడించాలని, తాము అధికారంలోకి రావాలని భావిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో- తెలంగాణలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, మేనిఫెస్టో రూపకల్పన అంశంపై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీశారు.
పూర్తిస్థాయి నివేదిక..
పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై పూర్తిస్థాయి నివేదికను వారికి అందజేశారు. బీఆర్ఎస్ ను ఓడించాలంటే దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని, అలాగే జాతీయ స్థాయి నాయకులు తరచూ తెలంగాణలో పర్యటించాల్సి ఉంటుందని బండి సంజయ్ సూచించారు. దీనికి అనుగుణంగా తాము ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటామని వివరించారు.
పాదయాత్ర వివరాలు..
ఈ సమావేశంలో- బండి సంజయ్ తన పాదయాత్ర వివరాలను పార్టీ అధిష్ఠానానికి వివరించారు. అయిదు దశల్లో పలు జిల్లాల్లో పాదయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటోన్నట్లుగా చెబుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి సమగ్ర నివేదికను రూపొందిస్తోన్నామని, అందులోని అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సి ఉంటుందనీ అన్నారు.
మోదీ ప్రశంసలు..
ఈ సందర్భంగా మోదీ- అమిత్ షా.. బండి సంజయ్ ను ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీకి దొరికిన మరో వెంకయ్య నాయుడిగా అభివర్ణించారు. ఇదే దూకుడును కొనసాగించాలని సూచించారు. అధికార పార్టీపై దూకుడు వైఖరిని కొనసాగిస్తూనే- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధుల వల్లే ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయనే విషయాన్ని వివరించాలని సూచించారు.