మనసు మార్చుకున్న ప్రధాని మోదీ..!!
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన హైదరాబాద్ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం.. ఆయన ఈ నెల 11వ తేదీన హైదరాబాద్కు రావాల్సి ఉంది. మాదాపూర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యూఎన్డబ్ల్యూజీఐసీ)ను ప్రారంభించాల్సి ఉంది. ఈ సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా- ఈ కార్యక్రమం రద్దయింది.
దేశ రాజధాని నుంచే ఆయన వీడియో కాన్ఫరెన్స్ రూపంలో యూఎన్డబ్ల్యూజీఐసీని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఐక్యరాజ్యసమితి-కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
రీజినల్ సమావేశాలు, వర్క్షాప్స్, స్టడీ ఈవెంట్స్, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఉపన్యాసాలను ఇందులో షెడ్యూల్ చేశారు. 120 దేశాలకు చెందిన సుమారు 2000 మంది ప్రతినిధులు పాల్గొనబోతోన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారని మొదట కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ఆయన రావట్లేదని, వీడియో కాన్ఫరెన్స్ రూపంలో సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తారని సమాచారం.
గతంలో ఇదే వేదిక మీద భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల కోసం బీజేపీ మొత్తం తరలివచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి మోదీ హైదరాబాద్ వస్తారని భావించినప్పటికీ.. అది రద్దయినట్లు చెబుతున్నారు.