నేడే హైదరాబాద్ కు ప్రధాని మోదీ - పీఎం వెంటే సీఎం కేసీఆర్ : సహస్రాబ్ది సమారోహం..!!
ప్రధాని మోదీ చాలా రోజుల తరువాత హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు. ఇప్పటికే కోట్లాది మందిని ఆకట్టుకుంటున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రధాని హాజరు అవుతున్నారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ప్రధాని మోదీ పంచలోహాలతో రూపొందించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.
Recommended Video
సహస్రాబ్ది సమరోహంలో ప్రధాని
రామానుజాచార్యుల జీవిత ప్రస్థానం, బోధనలపై 3డీ మ్యాపింగ్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలను సైతం సందర్శించనున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ బందో బస్తు ఏర్పాటు చేసారు. ప్రధాని హైదరాబాద్ వస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ ఆయన పర్యటనలో పాల్గొంటారా లేదా అనే చర్చ కొనసాగింది. దీనికి సమాధానంగా సీఎం కేసీఆర్ ఈ రోజున ప్రధానికి స్వాగతం పలకటం మొదలు..వీడ్కోలు వరకు ఆయనతోనే ఉంటారని అధికారులు వెల్లడించారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ
ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. 2.15 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో.. పటాన్చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్ జరిగే వేదిక వద్దకు చేరుకుంటారు. 2.45 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. 4.25 నిమిషాలకు ఇక్రిశాట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 4.50 గంటలకు హైదరాబాద్ హెలిప్యాడ్కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ మార్గంలో సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్లోని శ్రీరామ నగరానికి చేరుకోనున్న ప్రధాని..రాత్రి 8 గంటల వరకు అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకొని... రాత్రి రాత్రి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగు ప్రయాణం కానున్నారు.
ప్రధానితో పాటుగా సీఎం కేసీఆర్
ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రధానితో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటం పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొని ఉంది. గత ఏడాది సెప్టెంబర్ మూడో తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప్రధానితో తెలంగాణ సమస్యలపైన భేటీ అయ్యారు. ఇక, కొద్ది నెలలుగా కేంద్రం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్... బీజేపీని టార్గెట్ చేయటంతో పాటుగా.. ప్రధాని పైన విమర్శలు చేసారు. అయినా.. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలో సీఎం గా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలుకుతానని..అదే సమయంలో ఆయన పక్కనే కూర్చొని అన్ని విషయాలు నేరుగా చర్చ చేస్తానని సైతం చెప్పుకొచ్చారు. ఇక, ఈ పర్యటనలో ప్రధానితో సీఎం కేసీఆర్ కలిసి పాల్గొనటం పైన ఆసక్తి నెలకొని ఉంది.