ఒంటరి మహిళలే లక్ష్యం: చైన్ స్నాచర్ల అరెస్ట్(ఫొటో)
హైదరాబాద్: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నలుగురు దొంగలను శుక్రవారం సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 3లక్షలు విలువచేసే 24.5తులాల బంగారు గొలుసులు, సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వివరాలను క్రైం అదనపు డిసిపి జానకిషర్మిల మీడియాకు తెలిపారు.
గోల్కొండ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు మహ్మద్ అఫ్రోజ్.. ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు 19 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళల మెడలో ఉన్న గొలుసులను రెప్పపాటులో ఎత్తుకెళ్తుండేవాడు. ఇతడికి లంగర్హౌజ్కు చెందిన మహ్మద్ జాఫర్, రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, ఏసిగార్డ్స్కు చెందిన ఇర్ఫాన్లు అనుచరులుగా మారారు.
వీరందరూ కలిసి ఇప్పటి వరకు వనస్థలిపురం, మీర్పేట, చందానగర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, తదితర పోలీస్ స్టేషన్ పరిధిల్లో 19 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాలు బయటపెట్టారు. గతంలో అప్రోజ్ను హుమాయన్నగర్ పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదలయ్యాడు.
మళ్లీ అవే నేరాలకు పాల్పడుతున్న అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచర్లను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రైం అదనపు డిసిపి-2 ముత్తయ్య, క్రైం ఏసిపి రాములునాయక్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కాసిరెడ్డిలను డిసిపి జానకిషర్మిల అభినందించారు.