నయీం సోదరుడు సలీం అరెస్ట్: బావ ఫయీం ఇంటిని సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసును నిగ్గు తేల్చడానికి తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం రంగంలోకి దిగింది. సిట్ దర్యాప్తు ప్రత్యేక అధికారి నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం నార్సింగిలోని నయీం ఇంటికి చేరుకుంది. నాగిరెడ్డితో పాటు మరికొంత మంది అధికారులు నయీం ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆదిభట్లలో నయీం భూదందా: నగరంలో పదుల సంఖ్యలో ఇళ్లు కబ్జా
నార్సింగిలోని నయీం ఇంట్లోకి వెళ్లిన ప్రత్యేక అధికారి నాగిరెడ్డి ఇంటి మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నయీం ఇంటిలో ఉదయం నుంచి జరుగుతున్న సోదాలు, స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఆయన పరిశీలించి అనంతరం కొద్దిసేపటి క్రితం అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్యేక అధికారి నాగిరెడ్డి ఇప్పుడే బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. నయీం బెడ్ రూమ్, పర్సనల్ రూమ్ లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కపురి టౌన్షిప్లో నయిం ఇంట్లో 60కి పైగా ఖరీదైన వాచీలు, డైమండ్ రింగ్స్, ఏకే-47 గన్ ఉన్నట్లు సమాచారం.
నయీం ఇంట్లో జరుగుతున్న సోదాల గురించి స్థానిక ఏసీపీ గంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళవారం స్వాధీనం చేసుకున్న సొత్తుతో మరికొంత నగదుని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. కోర్టు అనుమతితో నయీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నామని, ఈ సోదాలు నిరంతరంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ దర్యాప్తు కోర్టు పరిధిలో ఉండటంతో తాను వివరాలు వెల్లడించలేనని ఆయన అన్నారు. కోర్టు అనుమతితో అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. నయీం ఇంట్లో సోదాల్లో భాగంగా భారీ ఎత్తున నగదుతో పాటు ఆయుధాలు దొరికినప్పటికీ వాటన్నింటిని కోర్టుకు సమర్పిస్తామని ఆయన తెలిపారు.
నయీం బంధువులు, కుటుంబ సభ్యలు ఇళ్లతో పాటు జరుగుతున్న ఈ సోదాలు నిరంతరంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. నయీం కేసు హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది కాబట్టి సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈరోజు రాత్రి 7 గంటలకు వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సోదాల్లో భాగంగా బంగారంతో పాటు కొంత నగదు, కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీం ఇంట్లో దొరికిన ఆస్తుల చిట్టా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హస్తినాపురంలోని ద్వారకా కాలనీలో కొన్నాళ్లపాటు నయీం తల్లి నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అక్కడ కూడా పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు నయీం బంధువుల ఇళ్లపై పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. నయీం డ్రైవర్ శ్రీధర్ గౌడ్ మరో అనుచరుడు బలరాంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డైరీ ఎఫెక్ట్, ప్రముఖులపై నిఘా: బంధువుపై నయీం ఫైర్, పోలీసులపై తీవ్ర వ్యాఖ్య
నయీం దందాలు, సెటిల్మెంట్లలో కీలక పాత్ర పోషించిన నయీం సోదరుడు సలీంను కుంట్లూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం ప్రధాన అనుచరుల్లో సలీం ఒకడిగా పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలలుగా హయత్ నగర్లోని కుంట్లూరులో సలీం నివాసం ఉంటున్నట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.
సోదాల్లో భాగంగా నయీం బావ ఫయీం ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. వనస్థలిపురం ద్వారకామయినగర్లో నయీం అనుచరుడు ఖయ్యూమ్ ఇంటిని బుధవారం పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లోనే మరో ఇద్దరు అనుచరులు నరేష్, సుధాకర్ ఉంటున్నారు. అయితే నయీం ఎన్ కౌంటర్ తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు.
వారిద్దరు రిటైర్డు ఏసీపీ ఇంటి సమీపంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో కూడా పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. నయీం అనుచరులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఓ లాడ్జిలో ముగ్గరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.