బండి సంజయ్పై దాడి: కవిత ఓడిందనే కేసీఆర్ కక్ష్య సాధింపు: అరవింద్ తీవ్ర విమర్శలు
నిజామాబాద్: ఓ పోలీస్ అధికారి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చేయి చేసుకోవడాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. వెంటనే డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కాబట్టి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆ అధికారులను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదని అరవింద్ మండిపడ్డారు. నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు , నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి వేధించిన పోలీసులు.. ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.

నిజామాబాద్లో కవిత, కరీంనగర్లో వినోద్ రావులు ఓడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉందని ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని ఆయన హితవు పలికారు.
కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పలికే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని అప్పటి వరకు బీజేపీ కార్యకర్తలకు అండగతా నిలబడతామన్నారు. దీని వెనక రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హస్తం ఉందని, పోలీసుల చేత మహమూద్ అలీ ద్వారా కేసీఆర్ ఈ వ్యవహరం నడిపిస్తున్నట్టు స్పష్టంగా అర్దమవుతోందని అరవింద్ అన్నారు.
బండి సంజయ్ ఆగ్రహం
కరీంనగర్ పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పోలీసులు తనపై దాడి చేశారని, పోలీసుల తీరుపై పార్లమెంటులో హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.












Click it and Unblock the Notifications