హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ భగ్నం... ఆరుగురు యువతులు,10 మంది యువకులు అరెస్ట్
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా కీసరలో ఆదివారం(డిసెంబర్ 27) రాత్రి జరిగిన ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కీసర పరిధిలోని తిమ్మాయిపల్లిలో ఉన్న ఫారెస్ట్ రిడ్జ్ రిసార్టులో ఓ ఫర్టిలైజర్ వ్యాపారి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రిసార్టుపై దాడులు చేసి ఆరుగురు యువకులు,10 మంది యువకులను అరెస్ట్ చేశారు.
సిద్దిపేట,వరంగల్,నల్గొండ,గజ్వేల్ జిల్లాలకు చెందిన ఫర్టిలైజర్ డీలర్లు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. బెస్ట్ క్రాఫ్ట్స్ సీడ్స్ కంపెనీ మేనేజర్ కూడా అరెస్టయినవారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయినవారి సెల్ఫోన్లతో పాటు వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది జూన్లో హైదరాబాద్లోని బంజారాహిల్స్లోనూ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఓ హోటల్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు యువతులు,నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ పార్టీలో ఓ మంత్రి అల్లుడు కూడా పాల్గొన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇదే ఏడాది జనవరిలో జూబ్లీహిల్స్లోని ఓ పబ్బులో కూడా రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 21 మంది యువతులను అరెస్ట్ చేశారు. ఓ ఫార్మా కంపెనీ పలువురు డాక్టర్లు,ఉద్యోగుల కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇటీవల కేరళలోని ఇడుక్కి జిల్లా వాగమోన్ కొండ ప్రాంతంలో అక్కడి పోలీసులు భారీ రేవ్ పార్టీని భగ్నం చేశారు. దాదాపు 60 మందిని అరెస్ట్ చేయగా ఇందులో టీవీ,సినీ నటులు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీరిలో చాలామంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు.