ఉత్తర్వుల ఉల్లంఘన: ఉత్తమ్కుమార్, షబ్బీర్ అలీలపై కేసు నమోదు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో జరిగిన దాడుల ఘటనలపై పోలీసులు గురువారం కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా విధించిన నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై మీర్చౌక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జంగంమెట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి మహేందర్ ఫిర్యాదు మేరకు అక్బరుద్దీన్పై కేసు నమోదు చేశారు.
ఎంఐఎం నేతలపై ఈసీకి ఫిర్యాదు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభల్లో ఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు తమ పార్టీ నాయకులను అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి నిరంజన్ కేంద్ర ఎన్నికల కమిషన్కు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎంఐఎంను రద్దు చేయాలని అసదుద్దీన్, అక్బరుద్దీన్లను చట్టసభల నుంచి అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, దిగ్విజయ్సింగ్ తదితరులను అసభ్య పదజాలంతో కించపరచడమే కాకుండా మత కల్లోలాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని పేర్కొన్నారు. ఇతరుల మత భావాలను కించ పరిచే విధంగా వారి ప్రసంగాలు ఉన్నాయని ఉదహరించారు. అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగ వీడియో కాపీలను ఫిర్యాదుతో జతపరిచారు.
ఇది ఇలా ఉండగా, గ్రేటర్ ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడ్డ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషాఖాద్రీ, బలాలాను వెంటనే అరెస్ట్ చేయాలని గ్రేటర్ శివసేన డిమాండ్ చేసింది. లేదంటే నగర సీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించింది. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న ఎంఐఎంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ ఇంఛార్జి సుదర్శన్, గ్రేటర్ అధ్యక్షులు ఎ.నర్సింగ్రావు కేంద్రాన్ని కోరారు.
షబ్బీర్ అలీ, ఉత్తమ్ పై దాడి కేసులో 9 మంది అరెస్ట్
కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన దాడి కేసులో పోలీసులు గురువారం మధ్యాహ్నం వరకు 9 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసులో ఎంపీ అసదుద్దీన్ను ప్రత్యేక దర్యాఫ్తు బృందం ప్రశ్నించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అసదుద్దీన్ యూపీలో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ వస్తారు. ఆయన వచ్చాక అతనిని పోలీసులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.