రూ.5 కోట్ల ఆస్తి.. రాసిస్తా: బుల్లితెర నటి శ్రీవాణి ట్విస్ట్, తండ్రి మెలిక
హైదరాబాద్/పరిగి: బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్య రెడ్డిలు గురువారం నాడు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పరిగిలో తాను ఉంటున్న ఇంటిని బలవంతంగా కూల్చివేశారని శ్రీవాణి వదిన (అన్నయ్య భార్య, అన్న చనిపోయారు) అనూష పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై శ్రీవాణి, శ్రీవాణి భర్త విక్రమాదిత్య రెడ్డి, శ్రీవాణి తండ్రి మాట్లాడారు. వారు వారి వారి వాదనలు వినిపించారు. అసలు పరిగిలోని ఇల్లు తన పేరు మీద లేదని, అలాంటప్పుడు తాను ఎందుకు కూల్చుతానని, కావాలంటే అక్కడ ఉన్న ఆస్తులన్నీ అనూష పేరు మీద రాసిస్తానని శ్రీవాణి వ్యాఖ్యానించారు.
అయితే, శ్రీవాణి తండ్రి మాత్రం మరోలా మాట్లాడారు. తనకు ఉన్న ఆస్తిని తన పిల్లలందరికీ పంచుతానని చెబుతున్నారు. తనకు ఐదుగురు ఆడపిల్లలు, కొడుకులు ఉన్నారని, వారందరికీ సమానంగా పంచుతానని చెప్పారు. తద్వారా పరిగిలో ఉన్న ఆస్తిని అనూషతో పాటు శ్రీవాణి, ఇతర కూతుళ్లకు ఇస్తానని చెప్తున్నారు.
ఆస్తికోసం వదినపై దాడి: బుల్లితెర నటి శ్రీవాణిపై కేసు
ఆస్తులన్నీ రాసిస్తా: శ్రీవాణి
తాను ఎప్పుడూ ఎక్కువగా పరిగికి వెళ్లలేదని, అసలు తన పైన కేసు ఎందుకు పెట్టారో తెలియదని శ్రీవాణి చెబుతున్నారు. తాను ఇల్లు కూల్చి నటిస్తున్నట్లుగా చెప్పడం సరికాదన్నారు. తనకు నటించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు.
తన అన్నయ్య తనను (వదిన అనూష భర్త) ఓ మాట అంటేనే మాట్లాడటం మానేశానని, నేను మాట పడనని చెప్పారు. ఇంటిని నేను లేదా మా వాళ్లు ఎవరూ కూల్చలేదన్నారు. అక్కడి వారు కూడా అబద్దం బుతున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో కూల్చివేయించానని చెప్పడం సరికాదన్నారు.
అసలు ఇప్పుడే కూల్చివేసి ఉంటే ఫోటోలు, ఆధారాలు ఉండాలి కదా అని ప్రశ్నించారు. దానిని ఎప్పుడో ఏడాది క్రితం తన బావ కూల్చివేయించారని చెప్పారు. తన పైన కేసులు ఎందుకు పెట్టారో తెలియదన్నారు. కుటుంబానికి నేను దూరంగా ఉండటం లేదని చెప్పారు.
అసలు, పరిగిలో ఉన్న ఆస్తితో నాకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అది తన ఆస్తి ఎలా అవుతుందన్నారు. తన తండ్రి పేర ఉందన్నారు. అక్కడ తన పేర ఏ ఆస్తి ఉన్నా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన తప్పు ఏం లేదు కాబట్టే, నా వాళ్లంతా ఇప్పుడు నా వైపు ఉన్నారని చెప్పారు. తన అన్నయ్యకు తల కొరివి కూడా పెట్టనివ్వలేదన్నారు. పోలీస్ స్టేషన్కు పిలిస్తే వెళ్లానని, కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలు చేద్దామనుకుంటున్నారేమో: శ్రీవాణి భర్త
ఆ ఇల్లు ఎలా కూలిపోయిందో తమకు తెలియదని శ్రీవాణి భర్త చెప్పారు. శ్రీవాణి సెలబ్రిటీ కాబట్టి ఆమెను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటుందేమోనని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్నారు. అనవసరంగా శ్రీవాణిని ఈ వివాదంలోకి లాగారని మండిపడ్డారు.
తండ్రి ట్విస్ట్
పరిగిలో ఉన్న తన ఆస్తుల విలువ రూ.ఐదారు కోట్ల వరకు ఉంటుందని శ్రీవాణి తండ్రి చెప్పారు. తనకు ఐదుగురు కూతుళ్లను, దానిని తన పిల్లలందరికీ సమానంగా పంచుతానని చెప్పారు. తన సోదరి ఎప్పుడు పరిగి వెళ్లలేదని, ఆమె ఎవరినీ వేధించలేదని శ్రీవాణి సోదరి చెప్పారు.
అనూష ఆగ్రహం
మీడియా సాక్షిగా తన కుటుంబం తన వెనుకే ఉందని శ్రీవాణి చెబుతోందని అబద్దమని అనూష అంటున్నారు. తన భర్త ఐసీయూలో ఉన్నప్పుడు అతనిని చూసేందుకు కూడా రాలేదన్నరు. తన భర్త మరణించినప్పుడు చూసేందుకు వచ్చిన శ్రీవాణి, గంటసేపు ఉండి వెళ్లారని ఆరోపించారు. భర్తకు చెప్పకుండా తన ఇంటికి వచ్చిన శ్రీవాణిని తాను ఎలా ఆదరించానో అమెకు తెలుసన్నారు. తన భర్తతో కలిసి శ్రీవాణి ఇంటికి వెళ్తే వెళ్లగొట్టిందన్నారు.