కారులో హెల్మెట్ పెట్టలేదని పోలీసుల జరిమానా?
సాధారణంగా ద్విచక్రవాహంనపై ప్రయాణించేటప్పుడు కచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ప్రతిచోట తనిఖీలు నిర్వహించి హెల్మెట్ లేనివారికి జరిమానా విధిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తలకు దెబ్బ తగిలితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నారు.
కారులో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలబారి నుంచి తప్పించుకోవడానికి సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. వారు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. కారులో వెళుతున్న ప్రయాణికుడు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ ట్రాఫిక్ పోలీసులు ఛలానా విధించారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మనదేశంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.
కేరళకు చెందిన అజిత్ కు ట్రాఫిక్ పోలీసులు ఛాలానా పంపించారు. మీరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదు కాబట్టి రూ.500 జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. అది చూసి అజిత్ షాకయ్యాడు. కారులో హెల్మెట్ పెట్టుకోవడమేంటో అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ కారులో ప్రయాణం చేస్తాడు. ద్విచక్రవాహం వాడడు. వెంటనే ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి, రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. విచారణ జరిపిన అధికారులు తప్పు జరిగిందని తెలుసుకున్నారు.
వేరెవరికో విధించాల్సిన ఛలానా తప్పుగా వచ్చిందని, అది మీదికాదని పోలీసులు సర్దిచెప్పారు. దీంతో అజిత్ ఏమీ మాట్లాడలేదు. ఆ ఛలానాను రద్దుచేసిన అధికారులు తిరిగి ఎవరికైతే దాన్ని విధించారో వారికి పంపించారు. ఆ వ్యక్తి నేను హెల్మెట్ ధరించాను అని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. మీ వెనకున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదంటూ వాదించారు. ఒక్కసారిగా ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో స్ప్రెడ్ అయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.