నయీంతో సంబంధాలు: ఆర్ కృష్ణయ్యను ప్రశ్నించిన పోలీసులు
హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు నోటీసులు పంపారు.
ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య సిట్ పోలీసులు ముందు హాజరై తన వాదనను వినిపించారు. సుమారు గంటపాటు ఎమ్మెల్యే కృష్ణయ్యను పోలీసులు ప్రశ్నించారు. నయీమ్ తో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. సరూర్నగర్లో కృష్ణ హత్య కేసులోనూ ఎమ్మెల్యేను ప్రశ్నించినట్లు తెలిసింది.
ముగ్గురు అధికారులు విచారించారు: కృష్ణయ్య
సిట్ విచారణ అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ముగ్గురు అధికారులు తనను ప్రశ్నించారని చెప్పారు. నయీంతో పరిచయం ఉంది గానీ, అతనితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేదని, అలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను డబ్బులు సంపాదించాలనుకుంటే వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుంటాను కానీ, ఇలాంటి పనులు చేయనని అన్నారు. తాను బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకుడినని చెప్పారు.
ప్రభుత్వం బలవంతంగా ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు మొదట అనిపించిందని అయితే, సిట్ విచారణ తర్వాత అదేం లేదనే అభిప్రాయం కలిగిందని చెప్పారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. నయీం తనను సీఎం కావాలనుకున్నాడని, కానీ, తాను నయీం అనుకుంటే కానని, ప్రజలు ఓట్లు వేస్తేనే సీఎం అవుతానని అన్నారు. నయీమ్ తో ఎలాంటి దందాలు చేయలేదని అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పారు.
కాగా, ఇంతకుముందు నయీమ్తో కృష్ణయ్యకు సంబందాలున్నట్లు పలువురు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు నయీమ్తో ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.
నయీమ్ తాను ఉద్యమం చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు కలుస్తుండేవారని ఆయన చెప్పారు. అయితే, అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని అన్నారు.