కడియంకు షాక్, హల్చల్: కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం వద్ద మంత్రి కడియం శ్రీహరి అనుచరులు, పోలీసులకు మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. పోలీసులు మంత్రికి షాకిచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది.
శాసన మండలి అభ్యర్థిగా కడియం శ్రీహరి నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయన వెంట పలువురు మద్దతుదారులు ఉన్నారు. కడియంతో పాటు వారు కూడా లోపలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
అంతమంది కార్యకర్తలను లోపలకు అనుమతించమని చెప్పారు. దీంతో కడియం అనుచరులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కడియం అనుచరుల హల్ చల్ కారణంగా అసెంబ్లీ ఆవరణలో స్వల్ప గందరగోళం చెలరేగింది.
ఎండకు కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎండకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వచ్ఛ హైదరాబాదులో భాగంగా ఆయన మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో బుధవారం పర్యటించారు. ఎండకు కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండ వేడిమికి తోడు చెమటలు అదే పనిగా పడుతుండంటతో ముఖాన్ని పలుమార్లు తుడుచుకుంటూ కనిపించారు. గొంతు ఎండిపోతుంటే మంచినీళ్లు తెప్పించుకొని తాగారు.