వైఎస్ షర్మిల యాత్రకు అనుమతి: కీలక షరతులు, అక్కడ్నుంచే తిరిగి ప్రారంభం
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాత్రకు అనుమతి లభించింది. వరంగల్లో పాదయాత్రకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు.
హైదరాబాద్: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి లభించింది. వరంగల్లో పాదయాత్రకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో గతంలో ఎక్కడైతే తన పాదయాత్ర నిలిచిపోయిందో.. అక్కడ్నుంచే తిరిగి ప్రారంభించనున్నారు షర్మిల.
చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా వద్ద గత నవంబర్ 28న షర్మిల అరెస్ట్తో పాదయాత్ర తాత్కాలికంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. జనవరి 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవడానికి వైఎస్సార్టీపీ నేతలు సీపీకి దరఖాస్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించుకోవడానికి సీపీ రంగనాథ్ అనుమతిచ్చారు. అయితే, ఈ యాత్రను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని షరతులు పెట్టారు. అంతేగాక, పార్టీలకు, కులాలకు, మతాలకు లేదా వ్యక్తిగతంగా గానీ ఎవరినీ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.
ర్యాలీల్లో టపాసులు ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దనే నిబంధనలతో షర్మిల యాత్రకు సీపీ అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల యాత్ర శంకరమ్మ తండా గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్ధన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, జఫర్ గఢ్, ఘన్పూర్, నర్మెట్ట, జనగామ, దేవురుప్పల, పాలకుర్తి మండలం దరిదేపల్లి కొనసాగతుంది.
అయితే, అనుమతి వచ్చినా రాకపోయినా తాను తన యాత్రను కొనసాగిస్తానని వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, పోలీసుల నుంచి అనుమతి లభించడంతో గతంలో ఆగిన చోట నుంచే తిరిగి యాత్రను కొనసాగించనున్నారు షర్మిల.












Click it and Unblock the Notifications