సోదాలు, జీపీ రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా: నా ఫ్రెండ్ని వేధిస్తారా.. పోలీసులకు లగడపాటి క్లాస్
Recommended Video
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గురువారం అర్ధరాత్రి పోలీసు తనిఖీల హైడ్రామా కలకలం రేపింది. ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో సోదాలకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఓ సివిల్ కేసులో జీపీ రెడ్డిని అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.
అయితే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎంట్రీతో పోలీసుల ప్రయత్నానికి బ్రేక్ పడింది. వారెంట్ లేకుండా ఎలా వచ్చారని పోలీసులను లగడపాటి నిలదీశారు. గురువారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత జూబ్లీహిల్స్లోని రోడ్డు నెంబర్ 65లో ఉంటున్న జీపీరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసేందుకు వెస్ట్ జోన్ డీజీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చారు.
ఫోన్ తీసుకొని ఆవేశంగా మాట్లాడారు
విషయం తెలియగానే లగడపాటి రాజగోపాల్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఏ ఆధారాలతో వచ్చారని, లోనికి వెళ్లడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు. తనిఖీలు చేసేందుకు వచ్చిన పోలీసులు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలిపారు. ఓ పోలీసు అధికారు ఉన్నతాధికారితో మాట్లాడుతుండగా ఆయన చేతి నుంచి లగడపాటి ఫోన్ తీసుకొని ఆవేశంగా మాట్లాడారు.
అర్ధరాత్రి ఎలా సోదాలు చేస్తారు.. పోలీసులకు లగడపాటి క్లాస్
ఈ కేసు సివిల్ వ్యవహారమని, ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితో అర్థరాత్రి ఇంటిపైకి ఎలా వస్తారని, జీపీ రెడ్డి నాలుగేళ్ల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారని, ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా మిమ్మల్ని ఎవరూ బదిలీ చేయలేరన్న ధీమాతో ఏమైనా చేయొచ్చని అనుకుంటున్నారా.. జీపీ రెడ్డి పోలీస్ స్టేషన్కు ఎన్నిసార్లు వచ్చారో తెలియదా, పోలీసులకు, జైళ్లకు, అరెస్టులకు భయపడి జీవించే అవసరం తమకు లేదని, తనకు కూడా చట్టాలు తెలుసునని, పోలీసులకు ఎవరిపైన అయినా కేసులు పెట్టే అధికారం ఉందని, కానీ మీకున్న విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్ చేయాలని అనుకుంటే మాత్రం కుదరదని లగడపాటి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
జీపీ రెడ్డి ఏం చెప్పారంటే?
వివాదానికి సంబంధించిన భూమి తనది కాదని, తనకు సంబంధించిన వ్యక్తులు ఆ భూమి కొన్నారని జీపీ రెడ్డి తెలిపారు. ఆ భూమిపై ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం నడుస్తోందని చెప్పారు. గతంలో తాను చాలాసార్లు పోలీస్ స్టేషన్కు హాజరయ్యానని చెప్పారు. ఆ భూ వివాదంపై రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ భూమికి సంబంధించిన వ్యవహారాలను తమ లాయరే చూసుకుంటున్నారని చెప్పారు. తన వద్ద ఉన్న భూపత్రాలు ఒరిజినల్ అని ఇద్దరు కలెక్టర్లు ధ్రవీకరించారని జీపీ రెడ్డి చెప్పారు. ఆ భూమి పైనే ముగ్గురి మధ్య వివాదం నడుస్తోందని చెప్పారు.
నా స్నేహితుడ్ని వేధిస్తున్నారు
దీనిపై లగడపాటి మాట్లాడుతూ.. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన స్నేహితుడిని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారి నాగిరెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాత కేసును పట్టుకొని అర్ధరాత్రి సమయంలో పోలీసులు హడావుడి చేశారన్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి సోదాలు చేయమని ఏ చట్టం చెబుతోందని అన్నారు.
ఏం చేయాలో తెలియక లగడపాటికి ఫోన్ చేశా.. జీపీ రెడ్డి కూతురు
రాత్రి పది గంటల సమయంలో పోలీసులు వచ్చారని జీపీ రెడ్డి కూతురు శైలజ చెప్పారు. పోలీసులు ఎందుకు వచ్చారో కూడా తెలియదన్నారు. వారి వద్ద వారెంట్ కూడా లేదని చెప్పారు. తన తండ్రిని పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లాలని చెప్పారని, తనకు భయం వేసి లగడపాటి రాజగోపాల్కు ఫోన్ చేశానని తెలిపారు. ఏడాదిన్నరగా తన తండ్రిని నాగిరెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని నాగిరెడ్డి ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. పోలీసులు అంటే తమకందరికీ గౌరవమని, మనం ఇలా భద్రంగా ఉండటానికి వారే కారణమని, కానీ నాగిరెడ్డి లాంట వారి వల్ల పోలీసు వ్యవస్థకు చెడు పేరు వస్తోందని వాపోయారు.