'యాసిన్ భత్కల్ను పోలీసులు ఎన్కౌంటర్లో చంపుతారేమో!'
హైదరాబాద్: జైలులో విచారణ ఖైదీగా ఉన్న యాసిన్ భత్కల్ను పోలీసులు చంపేస్తారేమోనని ఆయన తల్లి రిహానా సిద్ధిబా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి కారాగారంలో ఉన్నాడు. తన భార్యకు, తల్లికి ఫోన్ చేసి ఐస్ఐఎస్ సహకారంతో జైలు నుంచి తప్పించుకుంటానని, డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనను బయటకు తీసుకొస్తారని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
దీనిపై భత్కల్ తల్లి స్పందించింది. డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనను బయటకు తీసుకు వస్తారని యాసిన్ భత్కల్ తమతో చెప్పలేదని తెలిపింది. ఆ విషయం తమతో ఎన్నడూ చెప్పలేదంది. పోలీసుల నుంచి ప్రాణహానీ ఉందనే విషయాన్ని మాత్రం తమతో చెప్పాడంది.
తన కుమారుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది. హైసెక్యూరిటీ జైలు నుంచి ఎవరైనా ఎలా తప్పించుకోగలుగుతారని ప్రశ్నించింది. భత్కల్ గురించి తమకు ఆందోళన ఉందని తల్లి చెప్పింది.