‘భారత్ నెంబర్ 1 కావాలంటే.. రాజకీయ నేతలు, యువత ఆ దిశగా ఆలోచించాలి’
భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాల్సి ఉన్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడలేదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాల్సి ఉన్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడలేదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 'డీకోడ్ ది ఎకనామిక్ ఫ్యూచర్' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. భారతదేశంలో ఎంతమంది గొప్పవారు, తెలివైన నేతలున్నారని.. అయితే మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టలేదన్నారు.
ఏడాదంతా ఎన్నికలే ఉంటే ఎలా?: కేటీఆర్
భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి కన్నా.. రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, వారి దృష్టంతా ఎన్నికలైనే ఉంటుందన్నారు. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదేనని కేటీఆర్ అన్నారు.
రాజకీయ నేతలు, యువత ఆలోచన మారాలన్న కేటీఆర్
బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టిందని, అయితే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల ప్రతిపాదనలను పట్టించుకోలేదన్నారు. దేశ అభివృద్ధి కోసం కేటాయింపులు చేసినట్లు ఎక్కడ కనిపించలేదన్నారు. చైనా, జపాన్ లాంటి దేవాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు.
మనదేశంలో 60 శాతం మంది యువత ఉన్నారన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. మన యువత ఉద్యోగా లకోసం ఎదురుచూస్తోందని.. అయితే, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు కేటీఆర్.
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర గణనీయమన్న కేటీఆర్
మన దేశం నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తించదగిన బ్రాండ్స్ ఎందుకు రావడం లేదన్నారు కేటీఆర్. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ చిన్న దేశాలు ముందుకు వెళ్తున్నాయన్నారు. హైదరాబాద్ కన్నా చిన్నగా ఉండే సింగపూర్ కూడా ఇవాళ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర గణనీయమైనదని, దేశ జీడీపీలో 5 శాతం వాటా రాష్ట్రానిదేనన్నారు.
భారత్ నెంబర్ వన్ కావాలంటే.. ఇదొక్కటే మార్గం: కేటీఆర్
తెలంగాణ 3ఐ అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ విధానంతో ముందుకెళ్తోందని కేటీఆర్ చెప్పారు. టీఎస్ ఐపాస్ తో కంపెనీలకు ఆన్లైన్లోనే 15 రోజుల్లో అనుమతులిస్తున్నామని తెలిపారు. 16వ రోజు అనుమతి రాకపోతే ఆటోమేటిక్ గా అనుమతి ఇచ్చినట్లే అవుతుందన్నారు.
అమెజాన్ కు ప్రపంచంలోనే పెద్ద క్యాంపస్ హైదరాబాద్ లోనే ఉందన్నారు. గూగుల్, ఉబర్ లాంటి కంపెనీలు వాటి సెకండ్ క్యాంపస్ లను అమెరికా తర్వాత హైదరాబాద్లోనే ఏర్పాటు చేశాయని తెలిపారు. ఇతర దేశాల మాదిరిగా ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే భారతదేశం కూడా ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.