కన్నీరు ఆపుకోవడం కష్టం: జేపీ, బాగుందట: చంద్రబాబు: 'మహానటి'పై ప్రశంసల జల్లు
హైదరాబాద్: సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా మహానటి. సావిత్రిగా కీర్తి సురేష్ నటించిన, నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇలా పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేషి జీవించిందని కేటీఆర్ రెండు రోజుల క్రితం కితాబిచ్చారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు తెలిపారు.
నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది
మహానటి సినిమా చూశానని, అసామాన్య నటి సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ బయోపిక్ను అద్భుతంగా తెరకెక్కించారని జయప్రకాశ్ నారాయణ శుక్రవారం కితాబిచ్చారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, తెర వెనుక పని చేసిన బృందం, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఎంతో గొప్పగా పని చేశారన్నారు.
ఈ చిత్రం గొప్ప నటికి జీవం పోసింని, కన్నీరు ఆపుకోవడం కష్టమన్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేశ్, సమంతాలు అద్భుత నటన ప్రదర్శించారన్నారు. అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఎంతో కదలించిందని, భావోద్వేగం చెందేలా చేసిందని, నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుందన్నారు.
మహానటిపై చంద్రబాబు
టీడీపీ సమన్వయకర్తల భేటీలో కూడా మహానటి చిత్రం చర్చకు వచ్చింది. ఈ సినిమా బాగుందని తనతో చాలామంది చెప్పారని, మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చంద్రబాబు నేతలతో అన్నారు. బాగుందని అందరూ చెబుతున్నారని నేతలు కూడా చెప్పారు.