కేసీఆర్కు ఎన్నికల భయం?: వైఎస్ జగన్ స్ట్రాటజీ: బ్యాక్ అప్ రెడీ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కారణాలేమైనప్పటికీ ప్రతిపక్షాలు బలపడుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మళ్లీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. టీఆర్ఎస్ను బలంగా ఢీ కొట్టే శక్తిసామర్థ్యాలను అందుకుంటోన్నాయి. ఇదే క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైెఎస్ షర్మిల సైతం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోండటం రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తోన్నాయి.
చిచ్చు పెట్టిన బెలూన్లు: ప్రధాని మారినా..బాంబులు పేలడం మాత్రం ఆగట్లే
టీఆర్ఎస్పై రాజకీయ దాడి..
ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్కు ఇబ్బంది కలిగించేవిగా భావిస్తోన్నారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తరువాత.. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు సహజంగానే వీచే అవకాశాలు ఉంటాయనేది తెలిసిన విషయమే. దీనికితోడు ప్రతిపక్ష పార్టీలు బలోపేతం కానుండటం.. వైఎస్ఆర్టీపీ రూపంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించడానికి సన్నద్ధమౌతోండటం..వంటి పరిణామాలు టీఆర్ఎస్కు ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయని అంటున్నారు. వాటన్నింటినీ అధిగమించి- 2023లో అధికారంలోకి రావడానికి గులాబీదళం శక్తికి మంచి చెమటోడ్చక తప్పకపోవచ్చు.
ప్రశాంత్ కిషోర్తో
దీన్ని ముందే గ్రహించినట్టుంది టీఆర్ఎస్ అధిష్ఠానం. అందుకే- దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలను పాటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయక సహకారాలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం. ఏపీలో బలమైన తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టి- ఏకంగా 151 స్థానాలను గెలచుకుంది వైఎస్సార్సీపీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీని వెనుక ప్రశాంత్ కిషోర్..ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ ఉందనేది బహిరంగ రహస్యమే.
కేటీఆర్తో భేటీ..
రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో- ముందు జాగ్రత్త చర్యగా ప్రశాంత్ కిషోర్తోొ టైఅప్ కావాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదివరకే ఓ సారి ప్రశాంత్ కిషోర్- హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ- నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా మారింది. ప్రశాంత్ కిషోర్ సేవలను తీసుకోవాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఉన్నారని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అంగీకారాన్ని తెలిపారని అంటున్నారు.
రెండేళ్ల సమయంలో
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఈ లోగా- పరిపాలను పరుగులు పెట్టించడంతో పాటు రాజకీయంగా కూడా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉపయోగపడతాయనే అభిప్రాయాలు గులాబీ పెద్దల్లో నెలకొన్నాయి. తాను ఈ రంగం నుంచి తప్పుకొంటానని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత- ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే విషయం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్తో భేటీ స్పష్టం చేసింది.
Recommended Video
బీజేపీయేతర పార్టీలకు తోడుగా..
బీజేపీయేతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. బీజేపీయేతర పార్టీలను అధికారంలోకి తీసుకుని రావడం, వారు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యతను తీసుకోవడంలో ఆయన వెనుకంజ వేయబోరనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే.. తాను కాంగ్రెస్కు సైతం పనిచేస్తానంటూ ఇటీవలే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కూడా- ఆయన తన రంగం నుంచి తప్పుకోలేదనే సంకేతాలను పంపించినట్టయిందని అంటున్నారు.