KSR LIVE SHOW: తప్పు కోవడం వెనుక రాజకీయ నేతల హస్తం?
హైదరాబాద్: ఎన్ టీవీలో బాగా పాపులారిటీని తెచ్చుకున్న లైవ్ షోలలో ఒకటి KSR LIVE SHOW. ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 8.30 వరకు సమకాలీన పరిస్థితులపై కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా ఈ లైవ్ షో కోసం ఆసక్తిగా చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఎన్ టీవీలో ప్రసారమయ్యే ఈ లైవ్ షోకి రేటింగ్స్ కూడా బాగున్నాయి.
అందుకు ముఖ్య కారణం ఏంటంటే ఈ లైవ్ షోలో కెఎస్ఆర్ ప్రజలను భాగస్వాయ్యం చేయడమే. రాజకీయ నేతలు సైతం ఈ లైవ్ షోని వీక్షిస్తారనే విషయం సర్వేలో తేలింది. ఎన్టీవీ గౌరవ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే గత యాభై రోజులుగా ఈ లైవ్ షోకి కొమ్మినేని రావడం లేదు.
ఆయనకి బదులు ఎన్ టీవీ యాంకర్ రుషి ఆ షోని నిర్వహిస్తున్నారు. అయితే రుషి లైవ్ షోని నడిపిస్తున్న తీరు ప్రజలకు పెద్దగా నచ్చడం లేదు. దీనికి నిదర్శనం ఓ రోజు డిస్కషన్లో భాగంగా రుషి ఎమ్మెల్సీ రంగారెడ్డిని ఒక ప్రశ్న అడిగారు. సమాధానం అంతా విన్నాక తిరిగి అదే ప్రశ్న మళ్లీ రుషి వేశారు.
దీంతో రామాయణం అంతా విన్నాక రాముడుకు సీత ఏమవుతుంది అన్నట్లుగా ఉంది మీరు అడగడం అంటూ వ్యంగ్యంగా మాట్లాడారాయన. దీంతో యాంకర్ రుషి చిన్నబుచ్చుకున్నారు. కొమ్మినేని లైవ్ షోలో లేకపోవడంతో జనాలు కూడా పెద్దగా ఆసక్తిని కనబర్చడం లేదు.
కొమ్మినేని లైవ్ షోకు రాకపోవడానికి కారణం ఆయన వ్యాఖ్యలు వైసీపీకి మద్దతుగా ఉంటున్నాయంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడమే. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో కొమ్మినేని చర్చా కార్యక్రమాలు టీడీపీకి ఇబ్బందిగా మారాయి. సాక్షి పత్రిక అమరావతి భూ దురాక్రమణ పేరుతో వేసిన కథనంపై ఎన్టీవీలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. ఈ డిష్కసన్ టీడీపీని ఇరకాటంలో పడేసింది.
దీంతో కొమ్మినేని వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచనలో టీడీపీకి చెందిన నేతలే ఆయన్ని కెనడాకు వెళ్లేలా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం ఆయన లైవ్ షోకు రాకపోవడానికి గల కారణాలను తన పేరిట ఉన్న http://kommineni.info/లో వివరణ ఇచ్చారు.
స్వయంగా కొమ్మినేనే వివరణ ఇవ్వడంతో ఇది సంచనలమైంది. తన వివరణలో అధికార పార్టీ అనుకూలంగా జర్నలిస్టులు, టీవీ మీడియా లేకపోతే ఏకంగా టీవీ ప్రసారాలనే అధికార బలంతో అడ్డుకుంటారని తన వివరణలో ఆరోపిస్తూనే, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది పద్దతి కాదని సూచించారు.
కొమ్మినేని ఇచ్చిన వివరణ:
మిత్రులందరికి ముందుగా క్షమాపణలు. గత ఏభై రోజులుగా ఎందరో మెస్సేజీలు ఇస్తున్నా, మెయిల్స్ పంపుతున్నా సమాధానం ఇవ్వనందుకు మన్నించాలని కోరుతున్నాను. నేనే కావాలనే ఎవరికి సమాదానం ఇవ్వలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ఎన్.టి.వి లో రోజూ ఉదయం వచ్చే కెఎస్ ఆర్ లైవ్ షో లో ఎందుకు మీరు కనిపించడం లేదని చాలామంది అడుగుతున్నారు. కొద్దికాలం ఆగి సమాధానం ఇవ్వాలని అనుకోవడం వల్ల రిప్లై ఇవ్వలేదు తప్ప వేరే కాదు.చాలామంది నా పట్ల ఎంతో అభిమానం చూపుతూ మాట్లాడుతున్నారు. వారందరికి ధన్యవాదాలు.
నిజమే. నేను ఆ షో చేయలేకపోవడానికి ప్రధానంగా రాజకీయాలే కారణం. సహజంగానే అదికారంలోకి వచ్చిన కొందరు పెద్దలు తమ ప్రభావం చూపాలని అనుకున్నారు. అందులో భాగంగానే నన్ను ఆ షో నుంచి తప్పించాలని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒత్తిడి చేశారు.
ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలకు అవకాశం ఉంటుందని నమ్మేవారిలో నేను ఒకడిని, నాకుగా నేను తెలిసి ఎవరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో వ్యవహరించాలని అనుకోను.ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు.కాని నిజాయితిగా, నిర్మొహమాటంగా ,నిష్పక్షపాతంగా ఉండాలన్నదే నా అభిప్రాయం.
అందుకు అనుగుణంగానే టివీ డిబేట్ లు ఉండాలన్నది నా లక్ష్యం .అందువల్ల పలు సమస్యలు వచ్చే మాట వాస్తవమే.అయినా వాటిని తట్టుకుని ముందుకు సాగాలి.కాని ప్రభుత్వాలకు ఉండే అపరిమితమైన అదికారబలం ముందు వ్యక్తులు నిలబడడం కష్టం.అదే సమయంలో ఒక వ్యక్తి కోసం సంస్థలు దెబ్బతినరాదని నేను భావిస్తాను.
వందల మంది ఆధారపడే సంస్థలు బాగుండాలి. అందుకే నేను ఎన్.టి.వి నుంచి తప్పుకోవడానికి సిద్దమయ్యాను.లేకుంటే ఇప్పటికే ఒకసారి మూడు నెలలపాటు ఎపిలో టీవీని బంద్ చేశారు.మళ్లీ నా కారణంగా టీవీ ఆగిపోయే పరిస్థితి రాకూడదు.ఆ ఉద్దేశంతో బాధ్యతల నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను.
కాని ఎన్.టి.వి యాజమాన్యం, చైర్మన్ చౌదరి గారు నా పట్ల సహృదయతతో, గౌరవంతో అందుకు ఒప్పుకోలేదు. దాంతో కొంతకాలం టీవీ షో నుంచి తప్పుకోవాలని అనుకున్నాము.కొద్ది కాలం తర్వాత పరిస్థితులు మారతాయని,అప్పుడు తిరిగి షో చేయాలని అనుకున్నాము.
ఆ క్రమంలో నేను కొంత కాలం యాజమాన్యం సహకారంతోనే కెనడా వెళ్లి వచ్చాను.అయితే తిరిగి వచ్చాక కూడా ఇంకా సమస్య ఒక కొలిక్కి రాలేదు.సంప్రదింపులు జరుగుతున్నాయని యాజమాన్యం వారు చెప్పారు.మళ్లీ ఉద్యోగం నుంచి తప్పుకుంటానని,సంస్థ నా వల్ల ఇబ్బంది పడవద్దని యాజమాన్యానికి తెలిపాను.
కాని వారు అంగీకరించలేదు.మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దాంతో నేను కూడా మరీ మొండిగా ఉండరాదన్న ఉద్దేశంతో యాజమాన్యం నా పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతగా ఉండాలని భావించాను. బహుశా మరి కొంతకాలం షో లోకి రాలేకపోవచ్చని అనుకుంటున్నాను. ఒకందుకు సంతోషంగా ఉంది.
నేను ఎక్కడా ఆత్మ గౌరవాన్ని వదలుకోలేదు.ప్రజల పక్షాన,ఎవరు తప్పు చేసినా మాట్లాడే బాట నుంచి వైదొలగలేదు.నా అబిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు.కాని ఒక జర్నలిస్టు చేసే వ్యాఖ్యలకే ప్రభుత్వంలో అగ్ర స్థానంలో ఉన్నవారు భయపడతారా అనుకునే వాడిని. వాడి ఉద్యోగం తీయించుతారా అని అనుకుంటుండేవాడిని.
కొందరు గొప్ప జర్నలిస్టులకు ఎదురైన అనుభవాలు తెలుసు.నిజానికి నేను అంత గొప్పవాడినేమీ కాదు.ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది.కాని నేను ఎక్కడా రాజీపడకుండా ఉద్యోగం పోగొట్టుకోవడానికి కూడా సిద్దపడి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
అలాగే ఒక పార్టీ పట్ల అబిమానమో, ద్వేషమో లేవు.వ్యక్తులపై ఎలాంటి అగౌరవం లేదు. పరిస్థితులు మారతాయని , అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలకు ఎప్పటికైనా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను.
-
కొమ్మినేని
శ్రీనివాసరావు
వ్యాసకర్త
సీనియర్
పాత్రికేయులు