పొంగులేటి.. జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండు: కేటీఆర్ హెచ్చరిక
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వాళ్లు అరెస్ట్ అవుతారు.. వీళ్లు అరెస్ట్ అవుతారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరి జాతకాలు చెబుతున్నారు.. అసలు ఆయన ఎప్పుడు జలకు వెళ్తారో చూసుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడులు జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భారీ స్కాంలు జరిగితే కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు. మంత్రి పొంగులేటి జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.

వీడు జైలుకు పోతడు.. వాడు జైలుకు పోతడు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరి జాతకాలు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడు పోతావో చూస్కో.. నువ్వు హోం మంత్రివా.. డీజీపీవా.. నువ్వు ఎవడు.. ఎవరు అరెస్టు అయితరు.. ఎప్పుడు అరెస్టు అయితరు అని చెప్పడానికి..? నువ్వు, నీ ముఖ్యమంత్రి కేక్ కోసుకుని తిన్నట్టు కోసుకొని తినండి. రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి చేయండి. నీ కుటుంబ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి దండుకో. కానీ జైలుకు మాత్రం వేరేవాళ్లు వెళ్లాలి. ఇదేనా నీ నీతి.. నీ ప్రభుత్వం చిత్తశుద్ధి..? అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
నీ కంపెనీకి కనీసం ఆఫీస్ ఆఫ్ బెన్ ఫిట్ అని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా పనులు కట్టబెడతారు. రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమృత్ టెండర్లను కూడా పొంగులేటి కంపెనీకి ఇచ్చారు. రాఘవ కంపెనీని కూడా గతంలో రేవంత్ రెడ్డి తిట్టాడు. ఇప్పుడు మాత్రం ఆ కంపెనీకి పనులు ఇస్తున్నాడు. మూసీని కూడా టెండర్లు కాకముందే మేఘాకు ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసేశారని కేటీఆర్ తెలిపారు.
పొంగులేటి అందరినీ జైలుకి పంపుతానని నువ్వే జైలుకి పోయేలా ఉన్నావ్
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2024
పొంగులేటి వాళ్ళు వీళ్ళు జైలుకి పోతారని అనడం కాదు ముందు నువ్వు ఎప్పుడు జైలుకి పోతావో చూస్కో pic.twitter.com/Uo53iHOnvU
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ సోదాలపై ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ మాట్లాడటం లేదు. అదానీతో మీ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయో మాకు తెలుసు. మీ కుంభకోణాలను బయటపెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. అయిన సరే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులపై ఇప్పటి వరకు స్పందించకపోవటం అంటే బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యిందన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవ్వరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి చెబుతాడా..? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా...సర్కస్ నడుపుతున్నారా..? అని కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడితే ఉన్నతాధికారుల ఉద్యోగాలు ఊడగోడతామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. నీటి ప్రాజెక్టుల పేరుతో రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి తెరతీశారని కేటీఆర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications