పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరతారని తనకు మాటిచ్చారని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరతారని తనకు మాటిచ్చారని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. గురువారం మీడియా చిట్చాట్లో తన పాదయాత్రపై స్పందించారు. లా అండ్ ఆర్డర్ను అడ్డుపెట్టుకుని తన పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఎక్కడ తన యాత్రను ఆపారో అక్కడ్నుంచే మళ్లీ ప్రారంభిస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. హైకోర్టు, వరంగల్ పోలీస్ కమిషనర్ అనుమతులతో తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు వైఎస్ షర్మిల. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండాలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి దూరమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు గురించి గత కొన్ని నెలలు వార్తలు వస్తున్నప్పటికీ.. తాజాగా వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా.. చివరకు వైయస్సార్టీపీలో చేరతారని తెలుస్తోంది.
తాజాగా, వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు విషయంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్.. షర్మిలను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు వైయస్సార్టీపీలో శ్రీనివాస్ రెడ్డి చేరతానని మాటిచ్చారని షర్మిల తెలిపారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై ఎట్టకేలకు క్లారిటి వచ్చినట్లయింది. ఒకవేళ పొంగులేటి వైయస్సార్టీపీలో చేరితే ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ కొంతమేర బలపడే అవకాశం కూడా లేకపోలేదు.