కేసీఆర్ పాలనలో కరువు..: పొన్నాల, సీడీ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీలు మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ 'మిస్ రూల్' బుక్లెట్, ఒక్క 'కేసీఆర్.. వంద అబద్దాలు' సీడీని విడుదల చేశారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడారు. కేసీఆర్ వంద రోజుల పాలనలో ఆత్మహత్యలు, ఆవేదనలు, అఘాయిత్యాలు, కరువు, వరదలే అన్నారు. రూ.300 కోట్లతో కొత్త కార్లను కొన్న కేసీఆర్.. ఒక్క అమరవీరుడి కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని ఆరోపించారు.
ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గాన్ని చూపిన కేసీఆర్... తన పాలనలో మాత్రం ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వంద రోజుల్లో కాంగ్రెసు పార్టీ 90 శాతం హామీలను నెరవేర్చితే.. కేసీఆర్ వంద రోజుల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని షబ్బీర్ అలీ అన్నారు. మైనార్టీ కాలేజీలు మూతపడేందుకు కారణమయ్యాడన్నారు. కరెంట్ సమస్యను పట్టించుకోకుండా కార్మికులను ముంచారని దుయ్యబట్టారు.
కేసీఆర్ హామీలు నెరవేర్చుతాడన్న నమ్మకం లేదు: డి శ్రీనివాస్
కేసీఆర్ హామీలు నెరవేర్చుతాడన్న నమ్మకం లేదని డీ శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకే ఆయన హామీలు ఇచ్చారని విమర్శించారు. కేంద్రం కూడా రాష్ట్రానికి ఏమాత్రం సహకరించడం లేదన్నారు.